టీ20 వరల్డ్ కప్లో మహా సంగ్రామానికి వేళైంది. క్రికెట్ ప్రపంచమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భారత్-పాకిస్థాన్ పోరుకు రంగం సిద్ధమైంది. న్యూయార్క్లోని నాసా కౌంటీ క్రికెట్ స్టేడియంలో రాత్రి 8 గంటలకు ఈ హై వోల్టేజ్ వార్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో ఐర్లాండ్పై సునాయాసంగా గెలిచిన టీమిండియా రెట్టింపు ఆత్మవిశ్వాసంతో సిద్ధమవుతోంది.
మరోవైపు పాకిస్థాన్ది దీన గాథ. పసికూన అమెరికా చేతిలో కంగుతిని సొంత అభిమానుల నుంచి విమర్శలు ఎదుర్కొంటూ డీలా పడింది. అయితే పాకిస్థాన్ను భారత్ తేలికగా తీసుకునే ఛాన్స్ లేదు. వరల్డ్ కప్ హిస్టరీలో పాక్పై మనదే పైచేయి అయినప్పటికీ, ఆ జట్టు ఆఖరి వరకు గెలుపు కోసం పోరాడుతూనే ఉంటుంది. అంతేగాక బలబాలల్లో భారత్-పాక్ సమవుజ్జీలే.

ఈ నేపథ్యంలో పొరపాట్లకు తావు లేకుండా పాకిస్థాన్ పోరుకు సిద్ధం కావాలని టీమిండియా భావిస్తోంది. మరో కొన్నేళ్లు గుర్తుండేలా పాక్పై అసాధారణ విజయంతో చెలరేగాలని, కనికరం లేకుండా విరుచుకుపడాలని ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలో పిచ్కు తగ్గట్లుగా తుది జట్టుకూర్పును రెడీ చేస్తోంది. నాసా కౌంటీ స్టేడియంలోని పిచ్పై అస్థిర బౌన్స్ లభిస్తోంది. ఈ వికెట్పై విమర్శలు రావడంతో పిచ్ను మెరుగ్గా చేయడానికి ఐసీసీ రంగంలోకి దిగింది.
అయితే మ్యాచ్ స్లో వికెట్పైనే సాగుతుందనే టాక్ వినిపిస్తోంది. దీంతో ఐర్లాండ్తో తలపడిన తుది జట్టునే దాదాపు కొనసాగించాలని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తోంది. ఆల్రౌండర్లను జట్టులో ఎక్కువగా కొనసాగించాలనుకుంటుంది. మరోవైపు వికెట్ టేకర్ కుల్దీప్ యాదవ్ను బరిలోకి దించే ప్లాన్-బీతోనూ ఉంది. రవీంద్ర జడేజా స్థానంలో కుల్దీప్ను ఛాన్స్ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.
కాగా, టీ20 వరల్డ్ కప్లో ఇప్పటి వరకు భారత్-పాక్ ఏడు మ్యాచ్ల్లో ఆడింది. అయిదు మ్యాచ్ల్లో టీమిండియా, ఒక్క పోరులో పాకిస్థాన్ గెలిచింది. తొలి మ్యాచ్ టైగా ముగిసింది. ఈ మ్యాచ్లో భారత్ బౌల్ అవుట్లో నెగ్గింది. పాకిస్థాన్ అత్యధిక స్కోరు 159, అత్యల్ప స్కోరు 118 పరుగులు. ఈ రెండింటిని టీమిండియా ఛేదించింది.
పాకిస్థాన్ మ్యాచ్కు భారత తుది జట్టు (అంచనా)
రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లి, రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబె, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా/కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, మహ్మద్ సిరాజ్.