భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ అంటే ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఈ హైవోల్టేజ్ మ్యాచ్ను స్టేడియంలో వీక్షిండానికి టికెట్ల కోసం తీవ్రంగా పోటీపడుతుంటారు. ఇక నేరుగా చూడటానికి సాధ్యం కానీ అభిమానులంతా లైవ్ మ్యాచ్ చూస్తూ టీవీలు, ఫోనులకు అతుక్కుపోతుంటారు. భారత్-పాక్ మ్యాచ్కు ఉన్న క్రేజ్ను ఐసీసీ కూడా క్యాష్ చేసుకుంటున్న విషయం తెలిసిందే.
టీ20 వరల్డ్ కప్ లేదా వన్డే వరల్డ్ కప్.. ఏదైనా సరే, ఒకే గ్రూప్లో భారత్, పాక్ ఉండాలే ఐసీసీ ప్లాన్ చేస్తుంటుంది. మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్లోనూ ఇండియా, పాకిస్థాన్ గ్రూప్-ఏలోనే ఉన్నాయి. ఈ మ్యాచ్కు స్టేడియంలో డైమండ్ క్లబ్ విభాగంలోని ఒక్కో సీటు టికెట్ ధరను 20 వేల అమెరికా డాలర్లకు విక్రయిస్తున్నారు. అంటే సుమారు రూ.16.65 లక్షలు అన్నమాట.

విజయం కోసంభారత్-పాకిస్థాన్ ఆటగాళ్లు చేసే పోరాటం మైదానంలో ఓ యుద్ధాన్ని తలపిస్తుంటుంది. అందుకే ప్రపంచకప్ ఫైనల్ కంటే భారత్-పాక్ లీగ్ మ్యాచ్కే స్పెషల్ క్రేజ్ ఉంటుంది. అయితే ఈ టీ20 వరల్డ్ కప్లో జూన్ 9న జరగనున్న పోరులో పాకిస్థాన్పై టీమిండియానే గెలుస్తుందని ఆ దేశ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ పేర్కొనడం విశేషం. భారత్-పాక్ మ్యాచ్లో ఎవరు గెలుస్తారని భావిస్తున్నారని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు 'కచ్చితంగా ఇండియానే' అని అక్మల్ సమాధానమివ్వడం గమనార్హం.
వన్డే వరల్డ్ కప్లో ఆది నుంచి ఇప్పటివరకు పాకిస్థాన్పై భారత్దే పైచేయి. ప్రతి మ్యాచ్లోనూ విజయఢంకా మోగించింది మనమే. టీ20 వరల్డ్ కప్ల్లోనూ ఓ మ్యాచ్ మినహా మిగిలిన్నింట్లో ఇండియానే గెలిచింది. 2021 టీ20 వరల్డ్ కప్లో గెలుపే పాకిస్థాన్కు నిలిచిన ఏకైక ఊరట. దీంతో ఆ దేశ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ సైతం తమ పాక్ జట్టుపై నమ్మకం లేదని తెలిపాడు.
పాకిస్థాన్తో సిరీస్ కంటే ఐపీఎల్తోనే ఇంగ్లండ్కు ఎక్కువ ప్రాక్టీస్ లభిస్తుందని మాజీ క్రికెటర్ మైకేల్ వాన్ అన్న మాటలతో అక్మల్ ఏకీభవించాడు. ఐర్లాండ్ వంటి పసికూన జట్లతో ఓటమిపాలయ్యే తమ జట్టును అనడంలో తప్పేమి లేదని అన్నాడు. పాకిస్థాన్ క్రికెట్ ఎలా ఉంటుందో అందరికి తెలుసని, తమ పేలవ ప్రదర్శనే కారణమని తెలిపాడు.