వన్డే వరల్డ్ కప్ను తృటిలో చేజార్చుకున్న భారత్ మరో కప్ వేటకు సిద్ధమైంది. రేపటి నుంచి ప్రారంభంకానున్న టీ20 ప్రపంచకప్ను అందుకోవడానికి టీమిండియా ప్రణాళికలు రచిస్తోంది. గ్రూప్-ఏలో ఉన్న రోహిత్ సేన సూపర్-8కు చేరుకోవడం సులభమే. ఆ తర్వాత ఫైనల్కు అర్హత సాధించడానికి సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో దానికి తగ్గట్లుగా కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ ప్లాన్స్ వేస్తున్నారు.
అయితే టీ20 వరల్డ్ కప్లో భారత జట్టు కూర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తుదిజట్టులో చోటు ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ మొదలైంది. ఓపెనర్లుగా ఎవరు వస్తారు? ఫినిషర్ పాత్ర ఎవరు పోషిస్తారు? పేస్ బాధ్యతలు ఎవరు అందుకుంటారనే ప్రశ్నలు మొదలయ్యాయి. కాగా, రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి ఓపెనర్గా బరిలోకి దిగుతాడని ప్రముఖ వ్యాఖ్యాత, మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు.

అలాగే భారత జట్టు ఎంపికలో సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వడంపై మంజ్రేకర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. సీనియర్లకు బదులుగా కుర్రాళ్లతో జట్టును ఎంపిక చేస్తానని అన్నాడు. కానీ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిపై సెలక్టర్లు నమ్మకం ఉంచి ఎంపిక చేశారని అన్నాడు. అయితే కోహ్లి మూడో స్థానంలో బ్యాటింగ్ వచ్చే అవకాశాలు లేవని పేర్కొన్నాడు. ఆ స్థానంలో కోహ్లి దూకుడుగా ఇన్నింగ్స్ కొనసాగించలేడని తెలిపాడు. దీంతో మరో ఆప్షన్ లేకపోవడంతో రోహిత్తో కలిసి కోహ్లి ఓపెనింగ్ చేస్తాడని అన్నాడు.

బలవంతంగా ఇద్దరు కుడిచేతి వాటం బ్యాటర్లతో బరిలోకి దిగాల్సిన పరిస్థితి టీమిండియాకు ఎదురైందని సంజయ్ మంజ్రేకర్ అన్నాడు. ఈ క్రమంలో యశస్వీ జైస్వాల్ దురదృష్టవశాత్తు బెంచ్కే పరిమితం కావాల్సివస్తుందని తెలిపాడు. కానీ ఓపెనర్గా జైస్వాల్ ఎంపిక సరైనదని ఆయన అభిప్రాయపడ్డాడు. అయితే గతంలో సీనియర్లు నమ్ముకున్న సందర్భాల్లో టీమిండియాకు కలిసిరాలేదని, ఈసారి కలిసొస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపాడు. ఫినిషర్గా హార్దిక్ పాండ్యకు అవకాశం ఇవ్వాలని, ఆ పాత్రను అతను సమర్థవంతంగా పోషిస్తాడని మంజ్రేకర్ పేర్కొన్నాడు.