ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్పై భారత్ ఆరు పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మందకొడి పిచ్పై బ్యాటర్లు తడబడినా బౌలర్లు గొప్పగా రాణించి టీమిండియాను గెలిపించారు. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 19 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌటైంది. రిషభ్ పంత్ (42; 31 బంతుల్లో, 6 ఫోర్లు) టాప్ స్కోరర్. పాకిస్థాన్ బౌలర్లలో నసీమ్ షా (3/21), హారిస్ రవూఫ్ (3/21) చెరో మూడు వికెట్లు, మహ్మద్ అమీర్ (2/23) రెండు వికెట్లతో సత్తాచాటారు.
అనంతరం ఛేదనలో పాకిస్థాన్ 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేసింది. బుమ్రా (3/14) మూడు, హార్దిక్ పాండ్య రెండు (2/24), అర్షదీప్ (1/31), అక్షర్ పటేల్ (1/11) చెరో వికెట్ తీశారు. మహ్మద్ రిజ్వాన్ (31; 44 బంతుల్లో, 1 ఫోర్, 1 సిక్సర్) పోరాడాడు. అయితే ఛేదనను పాకిస్థాన్ దూకుడుగా ఆరంభించింది. అర్షదీప్ వేసిన మొదటి ఓవర్లో తొమ్మిది పరుగులు సాధించింది. ఆ తర్వాత సిరాజ్ను బాబర్ అజామ్ (13; 10 బంతుల్లో, 2 ఫోర్లు) బౌండరీతో స్వాగతం పలికాడు.

కానీ బుమ్రా బంతి అందుకోవడంతో పాకిస్థాన్ స్కోరు వేగం నెమ్మదించింది. అంతేగాక అయిదో ఓవర్లో కెప్టెన్ బాబర్ను బుమ్రా బోల్తాకొట్టించాడు. ఈ దశలో బ్యాటింగ్కు వచ్చిన ఉస్మాన్ న్(13; 15 బంతుల్లో, 1 ఫోర్)తో కలిసి మహ్మద్ రిజ్వాన్ ఇన్నింగ్స్ చక్కదిద్దడానికి ప్రయత్నించాడు.దీంతో 10 ఓవర్లకు 57/1తో నిలిచింది. చేతిలో తొమ్మిది వికెట్లు ఉండటంతో పాకిస్థాన్ ఫేవరేట్గానే నిలిచింది. కానీ డ్రింక్స్ బ్రేక్ తర్వాత అక్షర్ తొలి బంతికే ఉస్మాన్ను ఔట్ చేశాడు. మరో ఎండ్లో ఉన్న రిజ్వాన్ లక్ష్యాన్ని నెమ్మదిగా కరిగించాడు.
ఫకర్ జమాన్ (13; 8 బంతుల్లో, 1 ఫోర్, 1 సిక్సర్) దూకుడుగా ఆడటంతో భారత్ ఆశలు సన్నగిల్లాయి. కానీ భారత బౌలర్లు గొప్పగా పుంజుకున్నారు. హార్దిక్, బుమ్రా చెలరేగడంతో పాక్ క్రమంగా వికెట్లు కోల్పోయింది. చివరి రెండు ఓవర్లలో పాక్ విజయానికి 21 పరుగులు అవసరమవ్వగా బుమ్రా కేవలం మూడు పరుగులే ఇచ్చి ఇఫ్తికర్ (5; 9 బంతుల్లో)ను ఔట్ చేశాడు. ఆఖరి తొలి బంతికే ఇమాద్ వసీమ్ (15; 23 బంతుల్లో, 1 ఫోర్)ను అర్షదీప్ ఔట్ చేసి విజయాన్ని ఖరారు చేశాడు. చివరి మూడు బంతుల్లో 16 పరుగులు అవసరమవ్వగా నసీమ్ షా వరుసగా రెండు ఫోర్లు కొట్టి ఓటమి అంతరాన్ని తగ్గించాడు.
81/3 నుంచి 119/10
అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియాకు శుభారంభం దక్కలేదు. కీలక ప్లేయర్లు విరాట్ కోహ్లి (4; 3 బంతుల్లో, 1 ఫోర్), రోహిత్ శర్మ (13; 12 బంతుల్లో, 1 ఫోర్, 1 సిక్సర్) మూడు ఓవర్లలోపే పెవిలియన్కు చేరారు. ఈ దశలో వచ్చిన అక్షర్ పటేల్ (20; 18 బంతుల్లో, 2 ఫోర్లు, 1 సిక్సర్) తో పంత్ ఇన్నింగ్స్ చక్కదిద్దడానికి ప్రయత్నించాడు. అక్షర్ ఔటైనా పంత్ రాణించడంతో భారత్ 10 ఓవర్లకు 81/3తో మెరుగైన స్థితిలో నిలిచింది. కానీ ఆ తర్వాత తొమ్మిది ఓవర్లలో 38 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి ఆలౌటైంది.