దశాబ్ద కాలం నుంచి బలమైన భారత్ ఒక్క ఐసీసీ ట్రోఫీని కూడా సాధించలేకపోతుంది. 2013లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం మరోసారి విశ్వవిజేతగా నిలవలేకపోయింది. ప్రతి వరల్డ్ కప్లోనూ హాట్ ఫేవరేట్గా బరిలోకి దిగుతోంది. కానీ ట్రోఫీని అందుకోలేక చతికలపడుతోంది. గత 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో, 2022 టీ20 ప్రపంచకప్ సెమీస్లో ఓడి కప్ను అందుకోలేకపోయింది.
సూపర్ స్టార్లకు కొదవ లేనప్పటికీ కీలక మ్యాచ్ల్లో తడబడటం టీమిండియాకు పరిపాటిగా మారింది. అయితే మరో రెండు రోజుల్లో టీ20 వరల్డ్ కప్-2024 ప్రారంభమవుతున్న నేపథ్యంలో భారత్కు వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ బ్రియాన్ లారా కీలక సూచనలు చేశాడు. సుదీర్ఘ ప్రణాళికతో కప్ను కొట్టాలని ప్రధాన కోచ్ ద్రవిడ్ను సూచిస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు. వెస్టిండీస్-అమెరికా వేదికగా జూన్ 2 నుంచి ప్రపంచకప్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.

''గత వన్డే లేదా టీ20 ప్రపంచకప్ల్లో భారత్ ప్రదర్శనను పరిశీలిస్తే ఫైనల్ ప్లాన్ లేనట్లుగా కనిపిస్తోంది. జట్టులో ఎంతమంది సూపర్ స్టార్లు ఉన్నారనేది విషయం కాదు. వరల్డ్ కప్ను ఎలా సాధించనున్నారు? ఏ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు? ఎలా ఇన్నింగ్స్ లేదా దాడిని ఆరంభించనున్నారు? అనేది చాలా కీలకం. ఆటగాళ్లందరినీ ఒకతాటిపైకి తీసుకువచ్చి టీ20 వరల్డ్ కప్ను భారత్ గెలిచేలా రాహుల్ ద్రవిడ్ ప్రణాళికలు రూపొందిస్తాడని ఆశిస్తున్నా'' అని బ్రియాన్ లారా అన్నాడు.
గ్రూప్-ఏలో ఉన్న భారత్ సూపర్-8కు అర్హత సాధించడం సులభమే. కానీ కరేబియన్ దీవుల్లో జరిగే సూపర్-8లో టీమిండియా బలమైన ప్రత్యర్థులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత సెమీఫైనల్, ఫైనల్ మధ్య భారత్కు ఒకే రోజు విశ్రాంతి లభిస్తుంది. కాగా, గ్రూప్-ఏలో భారత్తో పాటు పాకిస్థాన్, ఐర్లాండ్, కెనడా, ఆతిథ్య జట్టు అమెరికా ఉన్నాయి. న్యూయార్క్ వేదికగా జూన్ 5న ఐర్లాండ్తో టీమిండియా తమ తొలి మ్యాచ్ ఆడనుంది.
టీ20 వరల్డ్ కప్కు ఎంపిక చేసిన టీమిండియా:
రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్య (వైస్ కెప్టెన్), యశస్వీ జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్) సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబె, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్