
ఇవ్వాళ్టి మ్యాచ్లివే..
గ్రూప్-బీలో భాగంగా నమీబియా-నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్ ఇంకాస్సేపట్లో ఆరంభం కానుంది. ఈ ఉదయం 9:30 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది. గ్రూప్- ఏలో శ్రీలంక తన రెండో మ్యాచ్ ఆడబోతోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ను ఢీ కొట్టబోతోంది. ఈ మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది. మెల్బోర్న్ గీలాంగ్లోని సైమండ్స్ స్టేడియం దీనికి వేదిక. స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ ఈ మ్యాచ్ను ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది.

టాపర్స్ ఈ జట్లే..
తొలి రౌండ్ ముగిసిన తరువాత గ్రూప్ - ఏ పాయింట్ల పట్టికలో నమీబియా అగ్రస్థానానికి చేరుకుంది. రెండో స్థానంలో నెదర్లాండ్స్ నిలిచింది. అట్టడుగు స్థానానికి దిగజారింది శ్రీలంక. గ్రూప్-బీలో స్కాట్లాండ్ అగ్రస్థానంలో కొనసాగుతోండగా.. వెస్టిండీస్ చిట్టచివరలో నిలిచింది. గ్రూప్స్లో ఉన్న ఆడబోయే అన్ని మ్యాచ్లను కూడా ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన దుస్థితిలో ఉన్నాయి శ్రీలంక గానీ.. వెస్టిండీస్ గానీ. ఏ మాత్రం తేడా కొట్టినా సూపర్ 12కు అర్హత సాధించలేవు.

అంచనాలపై..
కాగా- వరల్డ్ కప్పై అంచనాలు వెలువడుతున్నాయి. ఇంకా సూపర్ 12 దశ ఆరంభం కాకముందే ఎవరి అభిప్రాయాలు వారు వ్యక్తం చేస్తూ వస్తోన్నారు. టీ20 ప్రపంచకప్ ఫైనల్స్లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ తలపడొచ్చంటూ ఇదివరకే యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ అంచనా వేశాడు. ఈ రెండు జట్ల మధ్యే ఫైనల్స్ ఉంటాయని, కొద్దిగా కష్టపడితే పాకిస్తాన్కూ ఆ అవకాశం ఉందని పేర్కొన్నాడు. వెస్టిండీస్ ప్రస్థానంపై పెద్దగా అంచనాలేవీ లేదనీ పేర్కొన్నాడు.

సచిన్ ప్రిడిక్షన్స్..
ఇప్పుడు తాజాగా టీమిండియా లెజెండరీ బ్యాటర్ సచిన్ టెండుల్కర్ తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. సెమీ ఫైనల్స్ చేరడానికి అధిక అవకాశాలు ఉన్న జట్ల పేర్లను వెల్లడించారు. భారత్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్.. ఈ నాలుగూ టీ20 ప్రపంచకప్ సెమీ ఫైనల్స్ చేరుతాయని స్పష్టం చేశారు. అలాగే- ఈ నెల 23వ తేదీన జరిగే మ్యాచ్లో పాకిస్తాన్పై టీమిండియా ఘన విజయం సాధిస్తుందనీ వివరించారు.

ఈ నాలుగే..
ఓ ఇంగ్లీష్ డెయిలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాల గురించి ప్రస్తావించారాయన. ఓ భారతీయుడిగా టీ20 ప్రపంచకప్ను తన దేశం గెలవాలని ఎప్పుడూ కోరుకుంటానని పేర్కొన్నారు. భారత్ సహా పాకిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్..సెమీ ఫైనల్స్ చేరుకుంటాయని తాను అంచనా వేస్తోన్నట్లు చెప్పారు. అన్ని విభాగాల్లోనూ టీమిండియా బలంగా ఉందని వ్యాఖ్యానించారు సచిన్. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్లో టీమ్ మొత్తం సమతుల్యంగా కనిపిస్తోందని, జట్టు గెలవడానికి ఇదే ప్రధాన కారణమౌతుందని అన్నారు.

న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాకూ
న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్లు శ్రమించక తప్పదని, పరిస్థితులకు అనుగుణంగా ఈ రెండు జట్లు కూడా చెలరేగుతాయని సచిన్ టెండుల్కర్ అంచనా వేశారు. సెప్టెంబర్-అక్టోబర్ మధ్యకాలంలో దక్షిణాఫ్రికా.. భారత్లో పర్యటించిందని, ఇది ఆ జట్టుకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఆస్ట్రేలియాపై జరిగిన వామప్ మ్యాచ్ను కూడా సచిన్ టెండుల్కర్ ప్రస్తావించారు. ఆస్ట్రేలియా ఒత్తిడికి గురైందని, అదే సమయంలో పక్కా ప్లానింగ్ ప్రకారం- టీమిండియా బౌలర్లు కౌంటర్ అటాక్ చేశారని అన్నారు.


Click it and Unblock the Notifications












