
దుబాయ్: యూఏఈ, ఒమన్ వేదికగా అక్టోబర్ 17 నుంచి టీ20 ప్రపంచకప్ 2021 ప్రారంభంకానుంది. మెగా టోర్నీ కోసం యునైటెడ్ ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. అక్టోబర్ 17న క్వాలిఫైర్ మ్యాచులు ప్రారంభం కానుండగా.. అక్టోబర్ 23న సూపర్ 12 స్టేజ్ ఆరంభం అవుతుంది. పొట్టి ప్రపంచకప్లో భాగంగా అబుదాబిలో జరగబోయే తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు తలపడతాయి. ఇక గ్రూప్ 2లో భాగంగా అక్టోబర్ 24న భారత్, పాకిస్థాన్ మధ్య దుబాయ్లో తొలి మ్యాచ్ జరగనుంది. పొట్టికప్ కోసం ఇప్పటికే చాలా జట్ల ఆటగాళ్లు అక్కడికి చేరుకున్నారు. ఈ మెగా టోర్నీలో ఛాంపియన్గా నిలవడానికి ఆయా జట్లు వ్యూహాలను కూడా రచిస్తున్నాయి.
టీ20 ప్రపంచకప్ 2021 కోసం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. టీ20 ప్రపంచకప్లో డెసిషన్ రివ్యూ సిస్టమ్ (డీఆర్ఎస్)ను అమలు చేయనున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. పురుషుల టీ20 ప్రపంచకప్లో డీఆర్ఎస్ ఉయోగించడం ఇదే తొలిసారి. అంతకుముందు 2018 మహిళల టీ20 ప్రపంచకప్లో మొదటిసారి డీఆర్ఎస్ విధానాన్ని ప్రవేశపెట్టారు. 2020 మహిళ టీ20 వరల్డ్కప్లోనూ దీనిని ఉపయోగించారు. ఇక పురుషుల క్రికెట్లో ఐసీసీ నిర్వహించే మేజర్ టోర్నీల్లో చూసుకుంటే.. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ, 2019 వన్డే ప్రపంచకప్, తొలి ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్షిప్లో డీఆర్ఎస్ను అమలుపరిచారు.
డీఆర్ఎస్ మాత్రమే కాకుండా ఐసీసీ మరో నిర్ణయం కూడా తీసుకుంది. అదనంగా మరో రివ్యూను ఇస్తున్నట్లు ఐసీసీ పేర్కొంది. సాధారణంగా టీ20 మ్యాచ్లో ఇరు జట్లకు ప్రతీ ఇన్నింగ్స్లో ఒక రివ్యూ కోరే అవకాశం ఉంటుంది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా టీ20 ప్రపంచకప్లో తక్కువ అనుభవం ఉన్న అంపైర్లు పనిచేసే అవకాశం ఉన్నందున.. ఇరు జట్లకు అదనంగా మరో రివ్యూను ఇవ్వనున్నట్లు ఐసీసీ వెల్లడించింది. తాజా నిబంధనల ప్రకారం మ్యాచ్లో ఇరు జట్లకు రెండు ఇన్నింగ్స్ల్లోనూ రెండు రివ్యూలు కోరే అవకాశం ఉంటుంది. ఇది అన్ని జట్లకు లాభించే అంశమనే చెప్పాలి.
డక్వర్త్ లూయిస్ నిబంధనల్లోనూ ఐసీసీ కీలక మార్పులు చేసింది. టీ20 ప్రపంచకప్ 2021లో లీగ్ దశలో ఏవైనా మ్యాచ్లకు వర్షం అంతరాయం కలిగిస్తే.. డక్వర్త్ లూయిస్ పద్ధతిలో ఫలితాన్ని నిర్ణయించాలంటే ఇకపై ప్రతీ జట్టు కనీసం ఐదు ఓవర్లు బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. సెమీ ఫైనల్స్, ఫైనల్స్లో మాత్రం ప్రతీ జట్టు 10 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేస్తేనే.. డక్వర్త్ లూయిస్ పద్ధతి అమలవనుంది. 2018 మహిళల టీ20 ప్రపంచకప్లో ఈ విధానాన్ని మొదటిసారిగా అమలుపరిచారు. మొత్తానికి ఐసీసీ అన్ని జట్లకు బంపర్ ఆఫర్స్ ప్రకటించింది.