
టీ20 ప్రపంచకప్ సందడి..
ఒక్కరోజు విరామంతో ఇక టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ ఆరంభమౌతుంది. ఇప్పుడు ఐపీఎల్ కొనసాగుతోన్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సహా ఒమన్లో ఈ మెగా క్రికెట్ ఈవెంట్ మొదలవుతుంది. ఈ నెల 17వ తేదీన ఒమన్-పపువా న్యూగినియా మధ్య తొలి మ్యాచ్ నిర్వహిస్తారు. తొలిదశలో క్వాలిఫయర్ మ్యాచ్లు ఉంటాయి. విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమిండియా తన తొలి మ్యాచ్లోనే చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను ఢీ కొడుతుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో నిర్వహించే ఈ మ్యాచ్ ఈ నెల 24వ తేదీన ఉంటుంది.

దీనికంటే ముందే.. వార్మప్ మ్యాచుల్లో
క్వాలిఫయర్ మ్యాచ్లతో పాటు- టోర్నమెంట్ ఆరంభానికి ముందే పెద్ద జట్ల కోసం వార్మప్ మ్యాచ్లను షెడ్యూల్ చేసింది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. దీనికి సంబంచిన షెడ్యూల్ను అధికారికంగా కొద్దిసేపటి కిందటే ప్రకటించింది. 18, 20 తేదీల్లో ఈ వార్మప్ మ్యాచులను నిర్వహించనుంది ఐసీసీ. ఆప్ఘనిస్తాన్ సహా మొత్తం ఎనిమిది పెద్ద జట్లు వార్మప్ మ్యాచ్లను ఆడుతాయి. ఒక్కో జట్టు రెండేసి మ్యాచులను ఆడాల్సి ఉంటుంది.

వార్మప్లో టీమిండియా ప్రత్యర్థులెవరంటే..
ఈ మ్యాచుల్లో భారత జట్టు గట్టి ప్రత్యర్థులను ఎదుర్కొనబోతోంది. 18వ తేదీన జరిగే తొలి వార్మప్ మ్యాచ్లో ఇంగ్లాండ్తో ఆడుతుంది. ఇంగ్లాండ్ జట్టుకు ఇవాన్ మోర్గాన్ కేప్టెన్. భారత కాలమానం ప్రకారం.. సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది. 20వ తేదీన షెడ్యూల్ చేసిన రెండో వార్మప్ మ్యాచ్లో ఆస్ట్రేలియాతో తలపడుతుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3:30 గంటలకు మొదలవుతుంది. అటు ఇంగ్లాండ్, ఇటు ఆస్ట్రేలియా రెండు బలమైన జట్లే కావడం వల్ల- టీమిండియా శక్తి సామర్థ్యాలు ఎలా ఉన్నాయనే విషయం తేటతెల్లమౌతుంది.

కంప్లీట్ షెడ్యూల్ ఇలా..
మొత్తంగా ఎనిమిది జట్లు ఎనిమిది మ్యాచులను ఆడుతాయి. ఒక్కో టీమ్ రెండేసి మ్యాచుల్లో ప్రత్యర్థిని ఎదుర్కొంటాయి. 18వ తేదీన నిర్వహించే వార్మప్ మ్యాచ్లల్లో ఆఫ్ఘనిస్తాన్-దక్షిణాఫ్రికా, పాకిస్తాన్-వెస్టిండీస్, ఆస్ట్రేలియా-న్యూజిలాండ్, భారత్-ఇంగ్లాడ్ మధ్య పోరు ఉంటుంది. 20వ తేదీ నాటి మ్యాచ్లల్లో ఇంగ్లాండ్-న్యూజిలాండ్, భారత్-ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా-పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్-వెస్టిండీస్ తలపడతాయి. టీమిండియా ఆడే వార్మప్ మ్యాచ్లను స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ టెలికాస్ట్ చేస్తుంది.


Click it and Unblock the Notifications












