
దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇషాన్ కిషన్.. ఆ జట్టుకు కీలక ఆటగాడిగా మారిన విషయం తెలిసిందే. గత రెండేళ్లుగా ముంబై విజయాల్లో అతడు కీలక పాత్ర పోషించాడు. దాంతో అనూహ్యంగా టీ20 ప్రపంచకప్ 2021 ఆడే భారత జట్టులో ఇషాన్ స్థానం సంపాదించాడు. ఇక టీమిండియాకు అత్యంత కీలకమైన న్యూజిల్యాండ్ మ్యాచ్లో రోహిత్ శర్మ స్థానంలో ఓపెనర్గా బరిలోకి దిగి విఫలమయ్యాడు. అతనితో పాటు మిగతా ఆటగాళ్లు కూడా ఫెయిలవడంతో ఆ మ్యాచ్లో భారత్ ఓడిపోయింది. అంతకుముందు పాకిస్తాన్ చేతిలో కూడా కోహ్లీసేన ఓటమిపాలైంది.
రెండు పెద్ద జట్లపై పరాజయాల కారణంగా ఇప్పుడు టీ20 ప్రపంచకప్ 2021 సెమీస్ చేరకుండానే టీమిండియా ఇంటిదారి పట్టింది. ఆదివారం జరిగిన ఆఫ్ఘనిస్థాన్, న్యూజిల్యాండ్ మ్యాచ్ ఫలితంతో భారత జట్టు సెమీస్ ఆశలన్నీ ఆవిరైపోయిన విషయం తెలిసిందే. సోమవారం (అక్టోబర్ 8) నామమాత్రపు పోరులో నమీబియాతో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్ గెలిచినా.. టీమిండియాకు పెద్దగా ప్రయోజనం ఉండదు. అయితే మరో విజయంతో టోర్నీని ముగించాలని భారత్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్, హైదరాబాద్ సొగసరి వీవీఎస్ లక్ష్మణ్ ఓ సలహా ఇచ్చాడు.
మరికొద్దిసేపట్లో నమీబియాతో ఆరంభం కానున్న మ్యాచ్లో ఇషాన్ కిషన్ను ఓపెనర్గా పంపాలని వీవీఎస్ లక్ష్మణ్ సూచించాడు. స్టార్ స్పోర్ట్స్ షో గేమ్ ప్లాన్లో మాట్లాడుతూ... 'ఇషాన్ కిషన్ చాలా ప్రతిభావంతుడైన ఆటగాడు అని నేను అనుకుంటున్నాను. పవర్ ప్లేలో ఉండే ఫీల్డింగ్ నిబంధనలను చక్కగా ఉపయోగించుకుంటాడు. తనదైన శైలి క్రికెట్ ఆడతాడు. నమీబియాపై అతన్ని ఓపెనర్గా దింపితే బాగుంటుంది. కెఎల్ రాహుల్ మ్యాచ్ విన్నర్. అతని ప్రతిభ ఏమిటో మాకు తెలుసు. ఇషాన్ కిషన్కు చోటు కల్పించడం కోసం రోహిత్, రాహుల్ల జోడీని పక్కనపెట్టలేం. బహుశా టీమ్ మేనేజ్మెంట్ మరియు సెలక్షన్ కమిటీ మనస్సులలో ఈ ఆలోచన ఉండొచ్చు. నమీబియాతో జరగబోయే మ్యాచ్కు ఎటువంటి పరిణామాలు ఉండవనే అనుకుంటున్నా. బహుశా నమీబియా మ్యాచ్లో వారు ఇషాన్ కిషన్ను ప్రయత్నించవచ్చు' అని అన్నాడు.
టీ20 ప్రపంచకప్ 2021లో సూపర్ 12 రౌండ్ ఈరోజు చివరి దశకు చేరుకుంది. సోమవారం సూపర్ 12 చివరి మ్యాచ్ భారత్, నమీబియా మధ్య జరగనుంది. రెండు జట్లు సెమీఫైనల్ రేసులో లేనందున ఈ మ్యాచ్ నామమాత్రమే. గ్రూప్ 1 నుంచి ఇంగ్లండ్, ఆస్ట్రేలియా.. గ్రూప్ 2 నుంచి పాకిస్తాన్, న్యూజిలాండ్ సెమీ ఫైనల్కు చేరుకున్నాయి. అయితే ఈ విజయంతో తమ ప్రయాణాన్ని ముగించాలని టీమిండియా ప్రయత్నిస్తోంది. టీ20 ప్రపంచకప్లో భారత్ ప్రయాణం నిరాశాజనకంగా మిగిలిపోయింది. తొలి మ్యాచ్లో పాకిస్తాన్ చేతిలో ఓడగా.. రెండో మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో ఓడింది. ఆ తర్వాత స్కాట్లాండ్, ఆఫ్ఘనిస్తాన్లను ఓడించింది.