
ముంబై: యూఏఈ, ఒమన్ వేదికగా అక్టోబర్ 17 నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ 2021లో టీమిండియా ఆటగాళ్లు ధరించే అధికారిక జెర్సీలను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆవిష్కరించింది. బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో బుధవారం కొత్త జెర్సీకి సంబందించిన ఫొటో ఒకటి పోస్ట్ చేసింది. అందులో లోకేష్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా మరియు జస్ప్రీత్ బుమ్రాలు కొత్త జెర్సీలను దరించి ఫొటోలకు పోజులిచ్చారు. ఈ కొత్త కిట్ను 'బిలియన్ చీర్స్ జెర్సీ' అని పిలుస్తారని బీసీసీఐ పేర్కొంది. మునుపటి జెర్సీలతో పోలిస్తే.. ముదురు నీలం రంగులో కొత్త జెర్సీలు ఉన్నాయి.
క్రికెట్ అభిమానుల 'చీర్స్' ప్రేరణతో భారత జట్టు జెర్సీలను రూపొందించినట్లు బీసీసీఐ ట్విట్టర్లో వెల్లడించింది. టీమిండియా జట్టుకు కిట్ స్పాన్సర్గా ఎంపీఎల్ స్పోర్ట్స్ వ్యవహరిస్తోంది. ఈ జెర్సీలు కావాలనుకున్నవారు ఆన్లైన్లో ఆర్డర్ చేయవచ్చు. మీ గేమ్ను చూపించడానికి సిద్ధంగా ఉండండి అని బీసీసీఐ ట్వీట్ చేసింది. మాములుగా భారత ఆటగాళ్లు ధరించే జెర్సీల కంటే ఈసారి కలర్ డోస్ను పెంచేశారు. మెన్ఇన్ బ్లూ కాస్త.. థిక్ బ్లూగా మారిపోయింది. ప్రస్తుతం బీసీసీఐ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది. నైక్ సంస్థతో కాంట్రాక్ట్ పూర్తికావడంతో.. టీమిండియా కిట్ కొత్త స్పాన్సర్గా ఎంపీఎల్ను ఎంచుకుంది. ఇందులో భాగంగానే ఎంపీఎల్ స్పోర్ట్స్ భారత ఆటగాళ్లకు కొత్త జెర్సీలను అందజేసింది.
అక్టోబర్ 24వ తేదీ నుంచి టీ20 ప్రపంచకప్ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. గ్రూప్ 2లో భాగంగా అక్టోబర్ 24న భారత్, పాకిస్థాన్ మధ్య దుబాయ్లో తొలి మ్యాచ్ జరగనుంది. ఇదే మ్యాచుతో భారత్ తన ప్రయాణాన్ని మొదలు పెట్టనుంది. పాకిస్తాన్ మ్యాచ్ అనంతరం 31న న్యూజిలాండ్తో భారత్ తలపడనుంది. నవంబర్ 3న ఆఫ్గనిస్తాన్తో ఆడనుంది. ఇవి క్వాలిఫయర్లో గెలిచిన జట్లతో మరో రెండు మ్యాచులు కోహ్లీసేన ఆడనుంది. ఈ రెండు మ్యాచులు నవంబర్ 5, 8 తేదీల్లో జరగనున్నాయి. పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లను భారత్ ఓడిస్తే.. సునాయాసంగా తదుపరి రౌండ్ చేరుకుంటుంది.
టీ20 ప్రపంచకప్ 2021 టోర్నీ వార్మప్ మ్యాచ్లకు సంబందించిన షెడ్యూల్ను ఐసీసీ తాజాగా విడుదల చేసింది. క్వాలిఫైర్ మ్యాచులలో తలపడే జట్లు ఇప్పటీకే వార్మప్ మ్యాచ్లు ఆడుతున్నాయి. అక్టోబర్ 12 నుంచి 14 వరకు క్వాలిఫైర్ జట్లు వార్మప్ మ్యాచ్లు ఆడనున్నాయి. ఇక సూపర్ 12 స్టేజిలో ఉన్న జట్లకు వార్మప్ మ్యాచ్లు అక్టోబర్ 18న ఆరంభం కానున్నాయి. షెడ్యూల్ ప్రకారం విరాట్ కోహ్లీ సారధ్యంలోని టీమిండియా రెండు వార్మప్ మ్యాచ్లు ఆడనుంది. 18వన ఇంగ్లండ్తో (7:30 pm), 20న ఆస్ట్రేలియాతో (3:30 pm) భారత జట్టు వార్మప్ మ్యాచ్లు ఆడుతుంది. భారత్ ఆడే రెండు మ్యాచులు కూడా దుబాయ్ వేదికగానే జరగనున్నాయి. మొత్తం 16 వార్మప్ మ్యాచ్లు జరుగుతాయని, వాటిలో 8 మ్యాచ్లు స్టార్ ఛానెల్లో ప్రత్యక్ష ప్రసారం అవుతాయని ఐసీసీ తెలిపింది. ఐసీసీ డిజిటల్ వేదికల్లో ఈ మ్యాచ్ల హైలైట్స్ కూడా అందుబాటులో ఉండనున్నాయి.