సబ్స్టిట్యూట్ ఫీల్డర్గా:
ఒమన్, యూఏఈలో ఈ నెల 23న ఆరంభం కానున్న టీ20 ప్రపంచకప్ 2021లో భాగంగా పాకిస్థాన్తో ఆదివారం భారత్ జట్టు తలపడనున్న విషయం తెలిసిందే. దాంతో ముందస్తు జాగ్రత్తలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో కెప్టెన్ విరాట్ కోహ్లీ.. స్టార్ పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీకి రెస్ట్ ఇచ్చారు. దాంతో కెప్టెన్గా రోహిత్ శర్మ జట్టు పగ్గాలు అందుకున్నాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో సబ్స్టిట్యూట్ ఫీల్డర్గా మైదానంలోకి వచ్చిన కోహ్లీ.. కెప్టెన్ రోహిత్ శర్మ సూచన మేరకు రెండు ఓవర్లు బౌలింగ్ చేశాడు.
రెండు ఓవర్లు బౌలింగ్ చేసిన కోహ్లీ:
పవర్ ప్లే ముగిసే సమయానికి ఆస్ట్రేలియా మూడు వికెట్లు కోల్పోయి 34 పరుగులు చేసింది. అప్పటికి క్రీజులో స్టీవ్ స్మిత్, గ్లెన్ మాక్స్వెల్ ఉన్నారు. అయినా కూడా ఇన్నింగ్స్ ఏడో ఓవర్ విరాట్ కోహ్లీ వేశాడు. తన అద్భుత బౌలింగ్తో ఆ ఇద్దరికీ భారీ షాట్ ఆడే అవకాశం ఇవ్వలేదు. కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్తో కోహ్లీ మీడియం పేస్ బౌలింగ్ వేశాడు. దాంతో ఏడవ ఓవర్లో మాక్స్వెల్, స్మిత్ చెరో రెండు సింగిల్స్ మాత్రమే చేశారు. అనంతరం 13వ ఓవర్లోనూ బౌలింగ్కి వచ్చిన కోహ్లీ.. 8 పరుగులు ఇచ్చాడు. దాంతో ఫాన్స్ అందరూ ఖుషీ అయ్యారు. రోహిత్ కూడా సంతోషం వ్యక్తం చేశాడు. 2016 టీ20 ప్రపంచకప్లోనూ కోహ్లీ బౌలింగ్ చేసిన విషయం తెలిసిందే.
ఆరో బౌలర్ దొరికాడంటూ:
వార్మప్ మ్యాచులలో తుది జట్టును కెప్టెన్ ప్రకటించినా.. బెంచ్పై ఉన్న ఆటగాళ్లు కూడా మైదానంలో ఆడవచ్చు. బ్యాటింగ్, బౌలింగ్ కూడా చేసే వెసులబాటు ఉంటుంది. ఈ క్రమంలోనే మ్యాచ్లో లేకపోయినా కోహ్లీ బౌలింగ్ వేశాడు. గాయం కారణంగా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా బౌలింగ్కి దూరంగా ఉంటుండటంతో.. ఆరో బౌలర్ ఆప్షన్ కోసం టీమిండియా అన్వేషిస్తోంది. తాజాగా కోహ్లీ బౌలింగ్ చేయడంతో.. టీమిండియాకు ఆరో బౌలర్ దొరికాడంటూ ఫాన్స్ అభిప్రాయపడుతున్నారు. గతంలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సారథ్యంలో కోహ్లీ చాలాసార్లు బౌలింగ్ చేశాడు. క్రీజులో పాతుకుపోయిన జోడీని విడదీసేందుకు మహీ కోహ్లీతో బౌలింగ్ వేయించిన సందర్భాలు చాలానే ఉన్నాయి.
రోహిత్ చెప్పిన కాసేపటికే:
'విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీలు ఈ మ్యాచ్ ఆడటం లేదు. ఆరో బౌలింగ్ ఆప్షన్తో పాటు బ్యాటింగ్ కాంబినేషన్ను కూడా ఈ మ్యాచ్తో సెట్ చేయాలనుకుంటున్నాము. ఈరోజు మేము అన్ని ప్రయత్నాలు చేస్తాం. ప్రస్తుతానికి హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేయడం లేదు. బౌలింగ్ చేయడానికి కొంత సమయం పడుతుంది. టోర్నమెంట్ ప్రారంభానికి అతను సిద్ధంగా ఉండాలి. భారత జట్టులో నాణ్యమైన బౌలర్లు ఉన్నారు. అయినా ఆరో బౌలింగ్ ఆప్షన్ ఎంతో అవసరం. ఆరో బౌలర్ అవసరం అనుకుంటే నేనే బౌలింగ్ చేస్తా. విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ కూడా బౌలింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు' అని టాస్ సమయంలో రోహిత్ శర్మ అన్నాడు. ఆ కాపేటికే కోహ్లీ మైదానంలో కనిపించడం విశేషం.


Click it and Unblock the Notifications
