
హైదరాబాద్: యూఏఈ, ఒమన్ వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్ 2021కు సమయం ఆసన్నమవుతోంది. అక్టోబర్ 17 నుంచి ప్రపంచకప్ ప్రారంభంకానుంది. ఇప్పటికే ప్రాక్టీస్ మ్యాచులు ఆరంభం కాగా.. అక్టోబర్ 17న క్వాలిఫైర్ మ్యాచులు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 23న సూపర్ 12 స్టేజ్ ఆరంభం అవుతుంది. గ్రూప్ 2లో భాగంగా అక్టోబర్ 24న భారత్, పాకిస్థాన్ మధ్య దుబాయ్లో తొలి మ్యాచ్ జరగనుంది. దాయాదుల మధ్య చాలా రోజుల తర్వాత మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత భారత్, పాక్ తలపడడం ఇప్పుడే. దాంతో ఈ హై ఓల్టేజ్ మ్యాచుపై అందరిలో ఆసక్తి నెలకొంది. దీనిని మరింత పెంచింది మెగా టోర్నీ ప్రసరదారు సంస్థ స్టార్స్పోర్ట్స్. ఓ ఫన్నీ వీడియోతో స్టార్స్పోర్ట్స్ అభిమానులముందుకొచ్చింది.
భారత్, పాకిస్థాన్ల మధ్య మ్యాచ్ జరిగే సమయంలో వచ్చే 'మౌకా మౌకా' అనే యాడ్ ఎంత పాపులర్ అయిందోప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2015 ప్రపంచకప్ సమయంలో మొదలైన ఈ యాడ్.. ఐసీసీ టోర్నీలో భారత్-పాక్ జట్లు తలపడినప్పుడు ప్లే చేయడం ఆనవాయితీగా వస్తోంది. దీంతో ఈసారి కూడా వీక్షకులను ఆకట్టుకోవడానికి ఈ యాడ్ సరికొత్తగా వచ్చేసింది. పాక్ టీమ్ అభిమాని ఒకరు పటాకులు పట్టుకొని దుబాయ్ వచ్చేశాడు. ఈసారి దుబాయ్లో గెలుపు పక్కా.. అక్కడ పటాకులు కాలుస్తానంటూ ఓ టీవీ షో రూంకి వెళ్లి అంటాడు. అక్కడి భారతీయ అభిమాని అతడిపై పంచులు వేస్తాడు.
టీ20 ప్రపంచకప్ 2021 దుబాయ్ వేదికగా జరుగుతోన్న నేపథ్యంలో ఓ పాకిస్థాన్ అభిమాని టపాసులతో అక్కడి ఓ టీవీ షో రూంలోకి వెళుతాడు. అక్కడ ఉన్న తన భారతీయ స్నేహితుడికి టపాసులను చూపిస్తూ.. ఐసీసీ టీ20 ప్రపంచకప్ జరుగుతుంది, ఇందులో పాకిస్థాన్ గెలుస్తుందని అంటాడు. దీనికి స్పందించిన ఆ టీవీ ఓనర్.. తమ షాపులో ఓ ఆఫర్ ఉందని చెపుతాడు. అదేంటని పాక్ అభిమాని అడగ్గా.. 'బై వన్ బ్రేక్ వన్' ఆఫర్ ఉందంటూ ఫన్నీగా టీజ్ చేస్తాడు. అందుకు ఆ పాక్ ఫ్యాన్ బిక్కమొహం వేస్తాడు. ప్రస్తుతం ఈ యాడ్కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. భారత్, పాకిస్థాన్ మ్యాచ్ను ప్రమోట్ చేయడానికి స్టార్ స్పోర్ట్స్ ఇలా సరికొత్తగా ఆలోచించింది.
భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో గత కొన్నేళ్లుగా ఇరు జట్ల మధ్య ధ్వైపాక్షిక సిరీస్లు జరగడం లేదు. కేవలం ఐసీసీ టోర్నీల్లోనే దాయాది జట్లు తలపడుతున్నాయి. చివరగా 2012-13లో పరిమిత ఓవర్ల సిరీస్ కోసం భారత్లో పాక్ పర్యటించింది. 2008లో ఆసియా కప్ కోసం టీమిండియా.. పాక్కు వెళ్లింది. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియాను పాకిస్తాన్ ఓడించింది. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఆ జట్టు భారత్తో ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓటమి పాలైంది. 2018 ఆసియా కప్, 2019 వన్డే ప్రపంచకప్ పోరులో పాక్ ఓడిపోయింది. టీ20 ప్రపంచకప్లో పాక్తో భారత్ ఐదుసార్లు ఆడింది. అందులో భారత్ నాలుగు గెలుపొందింది.