
ప్రపంచకప్ రికార్డును చూస్తే:
అక్టోబర్ 24 న జరిగే మ్యాచ్తో భారత్, పాకిస్తాన్ జట్లు టీ20 ప్రపంచకప్ 2021లో తమ ప్రయాణాన్ని ప్రారంభించనున్నాయి. ఐసీసీ, ఆసియా కప్ టోర్నమెంట్లలో మాత్రమే దాయాది జట్ల మద్ధ పోరుకోసం అందరూ ఎదురుచూస్తున్నారు. ఇరు దేశాల క్రికెట్ అభిమానులతో పాటు మాజీ ఆటగాళ్లు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. అంతేకాదు ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు?, ఏ ఆటగాడు తన ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయిస్తాడు? అని అంచనాలు వేస్తున్నారు. అయితే ప్రపంచకప్ రికార్డును చూస్తే.. టీమిండియానే ఈ మ్యాచ్లో విజయం సాదించనుంది. అంతేకాదు భారత జట్టు పటిష్టంగా ఉండడం కూడా ఇందుకు మరో కారణం. ఇప్పటికే పలువురు మాజీలు ఈ మ్యాచుపై తమ తమ అభిప్రాయాలు చెప్పారు. తాజాగా పాకిస్తాన్ లెజెండరీ మాజీ బ్యాట్స్మన్ ముదస్సర్ నాజర్ కూడా తమ అభిప్రాయం చెప్పారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.

ఛాంపియన్స్ ట్రోఫీని పాక్ గెలిచింది:
తాజాగా క్రికెట్ పాకిస్తాన్తో ముదస్సర్ నాజర్ మాట్లాడుతూ... 'జట్ల బలం గురించి మాట్లాడితే.. పాకిస్తాన్ కంటే టీమిండియా చాలా ముందుంది. అయితే 2016 ఛాంపియన్స్ ట్రోఫీని పాకిస్తాన్ గెలిచింది. ఆ టోర్నీలో భారత్తో జరిగిన మొదటి మ్యాచ్లో పాకిస్తాన్ ఓడిపోయింది. అప్పుడు రెండు జట్ల మధ్య చాలా వ్యత్యాసం ఉంది. కానీ పాకిస్తాన్ ఫైనల్లో అద్భుతంగా ఆడింది. ఈసారి కూడా అదే జరుగుతుంది. ఈసారి టీమిండియాని పాక్ ఓడించగలిగితే.. టోర్నీని మంచి విజయంతో ఆరంభిస్తారు. అప్పుడు పాక్ జట్టుకు మేలు జరుగుతుంది' అని అన్నారు. వన్డే ప్రపంచకప్లో పాకిస్తాన్పై భారత్ 7 మ్యాచుల్లో గెలుపొందింది. భారత్-పాక్ రికార్డు 7-0గా ఉంది. అలానే టీ20 ప్రపంచకప్లలో కూడా భర 5-0తో ముందంజలో ఉంది. ముదస్సర్ నాజర్ పాక్ తరఫున 76 టెస్టులు, 122 వన్డేలు ఆడారు.

రోహిత్ శర్మ ప్రమాదకర బ్యాటర్:
టీమిండియా బ్యాటింగ్ అంత బలంగా లేదని, విరాట్ కోహ్లీ కంటే రోహిత్ శర్మ ప్రమాదకర బ్యాటర్ అని ముదస్సర్ నాజర్ పేర్కొన్నాడు. 'టీ20ల్లో ఒక బ్యాట్స్మన్ మంచి ఇన్నింగ్స్ ఆడినా లేదా ఒక బౌలర్ వికెట్లు తీసినా మ్యాచ్ స్థితే మారిపోతుంది. టీ20ల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. ఇంగ్లండ్లో ప్రదర్శనను చోసుకుంటే.. భారత బ్యాటింగ్ చాలా బలహీనంగా ఉంది. ఒక్కరు కూడా సరైన ప్రదర్శన చేయలేదు. విరాట్ కోహ్లీ కూడా గత 2-3 సంవత్సరాలుగా సరైన ఫాంలో లేడు. ఇటీవల ఒక్క సెంచరీ చేయలేదు. అతను సెంచరీల మీద సెంచరీలు చేసేవాడు కానీ ప్రస్తుతం ఆ ఫామ్ లేదు. అందుకే కోహ్లీ గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే కోహ్లీ కంటే రోహిత్ శర్మ ప్రమాదకరమైన ఆటగాడు. జట్లతో పోల్చితే పాకిస్థాన్ కంటే భారత జట్టు చాలా మెరుగ్గా ఉంది' అని ముదస్సర్ పేర్కొన్నారు.

ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో:
భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో గత కొన్నేళ్లుగా ఇరు జట్ల మధ్య ధ్వైపాక్షిక సిరీస్లు జరగడం లేదు. కేవలం ఐసీసీ టోర్నీల్లోనే ఇరు జట్లు తలపడుతున్నాయి. చివరగా 2012-13లో పరిమిత ఓవర్ల సిరీస్ కోసం భారత్లో పాక్ పర్యటించింది. 2008లో ఆసియా కప్ కోసం టీమిండియా.. పాక్కు వెళ్లింది. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియాను పాకిస్తాన్ ఓడించింది. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఆ జట్టు భారత్తో ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓటమి పాలైన విషయం తెలిసిందే. 2018 ఆసియా కప్, 2019 వన్డే ప్రపంచకప్ పోరులో దాయాది దేశం పరాజయం పాలయ్యింది. మరి ఇప్పుడు ఎవరు విజయం సాధిస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications
