అబుధాబి: వరుసగా రెండు రోజులు.. రెండు బిగ్ బడ్జెట్ సినిమాలకు సంబంధించిన టీజర్లు విడుదలయ్యాయి.. తెలుగులో. ఒకటి యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్-పూజా హెగ్డే జోడీగా నటిస్తోన్న రాధేశ్యామ్.. రెండోది- దక్షిణాది సూపర్ స్టార్, తలైవా రజినీకాంత్ నటించిన పెద్దన్న. అన్నాత్తే సినిమాకు డబ్బింగ్ ఇది. ఈ రెండు టీజర్లు కూడా టాలీవుడ్లో దుమ్ము దులుపుతున్నాయి. హయ్యెస్ట్ వీవర్షిప్ను సొంతం చేసుకుంటున్నాయి.
ఇప్పటిదాకా రాధేశ్యామ్ ట్రైలర్ను చూసిన వారి సంఖ్య 52 మిలియన్లను దాటేసింది. పెద్దన్నదీ అదే దూకుడు. విడుదలైన కొన్ని గంటల్లోనే 10 మిలియన్లను దాటేసింది. వాటి దూకుడు కొనసాగుతుండగానే.. మరో బ్లాక్ బస్టర్ టీజర్ రిలీజ్ అయింది. అభిమానులను పలకరించింది. ఏ ఒక్క భాషకో.. లేదా ఏ ఒక్క రాష్ర్రానికో పరిమితం అయ్యే టీజర్ కాదిది. ప్రపంచవ్యాప్తంగా భారతీయులు ఎక్కడ ఉన్నా.. వారిని ఆనంద డోలికల్లో ముంచెత్తింపజేసే మాస్ మసాలా టీజర్.
ఈ సాయంత్రం 7:30 గంటలకు భారత్-పాకిస్తాన్ మధ్య జరుగనున్న టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ మ్యాచ్కు సంబంధించిన టీజర్ ఇది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ దీన్ని ప్రత్యేకంగా రూపొందించింది. 58 సెకెన్ల పాటు నిడివి ఉన్న ఈ ప్రోమో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్లో ఇన్ని మ్యాచ్లు ఉండగా.. ఐసీసీ ప్రత్యేకంగా భారత్-పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ కోసమే ఈ ప్రోమోను రూపొందించిందంటే.. దీనికి ఉన్న ప్రాధాన్యత ఎలాంటిదో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
The world is watching.
— ICC (@ICC) October 24, 2021
Tonight in Dubai, India and Pakistan go toe-to-toe.#INDvPAK | #T20WorldCup pic.twitter.com/ynIzBry0ha
ఈ ప్రోమోలో ఐసీసీ వినియోగించిన కొన్ని పదాలు మ్యాచ్ తీవ్రతను తెలియజేస్తోన్నాయి. టు డే ఈజ్ ద బిగ్ డే అనే టైటిల్తో మొదలవుతుంది ఈ ప్రోమో. క్రమంగా ఒక్కో పదం వీక్షకుల ముందుకు వస్తుంది. ఇండియా.. పాకిస్తాన్, రైవల్రీ, ప్యాషన్, ప్రెషర్ అనే పదాలు మన కళ్లముందు సాక్షాత్కరిస్తాయి. చివరిలో ది వరల్డ్ ఈజ్ వాచింగ్ యు అనే సెంటెన్స్తో ఈ వీడియో ముగుస్తుంది. చూస్తున్నంత సేపూ గూస్ బంప్సే. ఒంటి మీద వెంట్రులు నిక్కబొడుచుకునేలా ఉంటుందీ ప్రోమో.
భారత్-పాకిస్తాన్ మధ్య ఇదివరకు జరిగిన మ్యాచ్లకు సంబంధించిన క్లిప్పింగ్స్.. ప్రేక్షకుల హర్షధ్వానాలు అదర గొట్టేలా ఉంటాయి. భారీ షాట్లు, క్యాచ్లు, వికెట్లు గాల్లోకి లేవడాలు.. ఇవన్నీ ఈ ప్రోమోను రెప్పవాల్చకుండా చేస్తాయి. ఈ సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ మొదలు కావాల్సి ఉండగా.. ఉదయమే- దీన్ని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ విడుదల చేసింది. తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్పై పోస్ట్ చేసింది.