
ఇస్లామాబాద్: గత ఏడాది కాలంగా వాయిదా పడుతూ వస్తోన్న టీ20 ప్రపంచకప్ 2021 టోర్నమెంట్ నిర్వహణకు సన్నాహాలు సాగుతున్నాయి. ఈ ఏడాది అక్టోబర్-నవంబర్లో ఈ టోర్నీ నిర్వహించడం దాదాపు ఖాయమైనట్టే. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు దీన్ని తరలించాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు. ఈ టోర్నీ ఆరంభమయ్యే సమయానికి దేశంలో సానుకూల పరిస్థితులు ఉంటే.. ఇక్కడే ఆడే అవకాశాలను కూడా కొట్టిపారేయలేం.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్ 14వ ఎడిషన్ వాయిదా పడటంతో క్రికెట్ ప్రేమికులు ఈ మెగా ఈవెంట్ కోసం ఎదురు చూస్తోన్నారు. వచ్చేనెల 18వ తేదీన ఇంగ్లాండ్లోని సౌథాంప్టన్లో ఆరంభమయ్యే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ దీనికి బోనస్. ఈ మ్యాచ్ తరువాత భారత జట్టు ఇంగ్లాండ్ టీమ్తో అయిదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ను ఆడాల్సి ఉంది. ఆగస్టు 4వ తేదీన సెప్టెంబర్ 14వ తేదీన తొలి టెస్ట్ ఆరంభమౌతుంది.
దీని సంగతెలా ఉన్నప్పటికీ- ధనాధన్ క్రికెట్ కావడం, ఐసీసీ నిర్వహించే మెగా టోర్నీ కావడం వల్ల టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్పైనే అభిమానులు ఫోకస్ పెట్టారు. ఈ సారి టైటిల్ను ఎవరు ఎగరేసుకెళ్లొచ్చనే డిబేట్ కూడా సాగుతోంది. దీనిపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సల్మాన్ బట్.. ఓ లిస్ట్ ప్రిపేర్ చేశాడు. టాప్-5 జట్లను ఇందులో చేర్చాడు. ఇందులో ట్విస్ట్ ఏమిటంటే- తన సొంత దేశం పేరును ఫేవరెట్స్ లిస్ట్లో చేర్చలేదా మాజీ డాషింగ్ ఓపెనర్. తన జాబితాలో టీమిండియాకు టాప్ ప్రయారిటీ ఇచ్చాడు. ఆస్ట్రేలియా జట్టును చివరి స్థానంలో నిలిపాడు.
భారత్, ఇంగ్లాండ్, వెస్టిండీస్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాలు ఈ సారి టీ20 ప్రపంచకప్ టైటిల్ను గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నట్లు చెప్పాడు. ఈ సారి విజేతగా ఆవిర్భవించే అవకాశాలు భారత్కే అధికంగా ఉన్నాయని తేల్చేశాడతను. 2019 ప్రపంచకప్ సెమీ ఫైనల్లో దురదృష్టం వెంటాడటం వల్లే టీమిండియా ఓడిందని చెప్పుకొచ్చాడు. ఈ సారి ఆ పరిస్థితి ఉండబోదని అన్నాడు. టీ20 వంటి ధనాధన్ ఫార్మట్లో టీమిండియా రెచ్చిపోయి ఆడుతుందని, ఆ జట్టు ఆటగాళ్లకు ఐపీఎల్ అనుభవం బాగా ఉపయోగపడుతుందని వ్యాఖ్యానించాడు.