హైదరాబాద్: రెండు దశాబ్దాల పాటు వన్డే క్రికెట్ను ఏలిన ఆస్ట్రేలియా ఎట్టకేలకు టీ20 ఫార్మాట్లో తొలిసారి విశ్వవిజేతగా నిలిచింది. ఏమాత్రం అంచనాల్లేకుండా టీ20 ప్రపంచకప్ 2021లో అడుగుపెట్టిన ఫించ్ సేన.. నిలకడైన ఆట తీరుతో టైటిల్ కైవసం చేసుకుంది. ఫీల్డింగ్, బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో సత్తాచాటిన ఆసీస్ అదుర్స్ అనిపించింది. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచులో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ను ఓడించింది. వన్డే ఫార్మాట్లో ఐదు సార్లు విశ్వవిజేతగా నిలిచిన ఆసీస్కు టీ20ల్లో ఇదే తొలి టైటిల్. మరోవైపు మొదటిసారి తుది పోరుకు అర్హత సాధించిన కివీస్ రన్నరప్తో సరిపెట్టుకుంది.
టీ20 ప్రపంచకప్ 2021 మొత్తం ప్రైజ్మనీ 42 కోట్లు. మెగా టోర్నీలో పాల్గొన్న మొత్తం 16 జట్లకు ఆ అమౌంట్ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) పంపిణీ చేసింది. మెగా టోర్నీలో చాంపియన్గా నిలిచి ఆస్ట్రేలియాకు మొత్తం 13.1 కోట్ల ప్రైజ్మనీ దక్కింది. ఈ మొత్తంలో టోర్నీ గెలిచినందుకు 11.9 కోట్లు, 4 లీగ్ మ్యాచ్లు గెలిచినందుకు 1.2 కోట్లు ఆస్ట్రేలియాకు దక్కాయి. రన్నరప్ న్యూజిలాండ్కు 7.15 కోట్ల ప్రైజ్మనీ వచ్చింది. ఫైనల్లో చేరినందుకు 5.95 కోట్లు, సూపర్-12లో 4 మ్యాచ్లు గెలిచినందుకు కివీస్కు అదనంగా 1.2 కోట్లు దక్కాయి.
ఇక టీ20 ప్రపంచకప్ 2021లో సెమీస్కు చేరిన ఇంగ్లండ్ జట్టుకు 4.2 కోట్లు, పాకిస్తాన్ జట్లకు 4.5 కోట్లు దక్కాయి. ఇందులో 5 మ్యాచ్లు నెగ్గిన పాకిస్థాన్కు అదనంగా 1.5 కోట్లు దక్కాయి. ఇక గ్రూప్ 2లో లీగ్ దశలో నిష్క్రమించిన భారత్, నమీబియా, స్కాట్లాండ్ జట్లకు సమానమైన ప్రైజ్మనీ దక్కింది. మూడు జట్లకు చెరో 1.42 కోట్ల ప్రైజ్మనీ దక్కింది. లీగ్ దశలో భారత్ మూడు విజయాలు, రెండు ఓటములను ఎదుర్కొన విషయం తెలిసిందే. శ్రీలంక (2.02 కోట్లు), దక్షిణాఫ్రికా (1.72 కోట్లు), బాంగ్లాదేశ్ (1.12), ఆఫ్ఘనిస్తాన్ (1.12), వెస్టిండీస్ (82 లక్ష్యలు)కు ప్రైజ్మనీ దక్కింది. ఇక ఒమన్, ఐర్లాండ్ జట్లకు 60 లక్ష్యలు, పూప న్యూ గునియా, నెదర్లాండ్ జట్లకు తలో 30 లక్షల ప్రైజ్మనీ దక్కింది.