హిస్టరీ రిపీట్..
అదే చరిత్ర మళ్లీ పునరావృతం అవుతుందనే అంచనాలు అభిమానుల్లో వ్యక్తమౌతోన్నాయి. క్రికెట్లో చిరకాల ప్రత్యర్థులంటూ ఏవైనా జట్లు ఉన్నాయంటే అవి భారత్-పాకిస్తాన్లే. ఈ రెండు దేశాల మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్ను మ్యాచ్గా చూడరు అభిమానులు. అంతకు మించి.. అనే స్థాయిలో ఉంటుంది. భారత్-పాకిస్తాన్ జట్లు తలపడుతున్నాయంటే- రెండు దేశాల మధ్య ఓ యుద్ధ వాతావరణం క్రీడా మైదానంలో కనిపిస్తుంటుంది. ఈ రెండు దేశాలకు చెందిన కోట్లాదిమంది ప్రజలు ఈ మ్యాచ్ పట్ల అత్యంత ఆసక్తిగా, అంతకుమించి ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తుంటారు. తమ దేశం గెలవాలని కోరుకుంటుంటారు.
7:30 గంటల నుంచి టీవీలకు అతుక్కుపోవడమే.
అలాంటి వాతావరణమే మరోసారి ఏర్పడింది. టీ20 ప్రపంచకప్ 2021 మెగా టోర్నమెంట్లో భాగంగా భారత్-పాకిస్తాన్ తలపడనున్నాయి. ఈ హైఓల్టేజ్ మ్యాచ్కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా మారింది. భారత కాలమానం ప్రకారం.. ఆదివారం సాయంత్రం 7:30 గంటలకు ఈ మ్యాచ్ మొదలవుతుంది. టీమిండియాకు విరాట్ కోహ్లీ, పాకిస్తాన్ జట్టుకు బాబర్ ఆజమ్ నాయకత్వాన్ని వహిస్తున్నారు. ఈ మ్యాచ్ కోసం జనం టీవీలకు అతుక్కుపోవడం ఖాయమే.
హార్దిక్ డుమ్మా..
ఇలాంటి కీలకమైన మ్యాచ్ ముందు- అంతే కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ప్రత్యేకంగా టీమిండియా జట్టు కోసం ఏర్పాటు చేసిన ఆప్షనల్ ట్రైనింగ్ సెషన్కు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా డుమ్మా కొట్టాడు. ఈ ట్రైనింగ్ సెషన్స్లో పాల్గొనలేదు. భారత్-పాకిస్తాన్ మ్యాచ్లో కీ ప్లేయర్గా అంచనాలు ఉన్న హార్దిక్ పాండ్యా.. ఈ సెషన్స్లో కనిపించలేదు. అదే సమయంలో మిగిలిన జట్టు ప్లేయర్లు.. కేప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కేప్టెన్ రోహిత్ శర్మ, ఓపెనర్ కేఎల్ రాహుల్, మిడిలార్డర్ బ్యాట్స్మెన్స్ రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, మరో ఆల్రౌండర్ రవీంద్ర జడేజా గ్రౌండ్లో కనిపించారు.
ఆరో స్థానంలో..
పాకిస్తాన్తో ఆ సాయంత్రం జరిగే మ్యాచ్లో హార్దిక్ పాండ్యా ఆరో స్థానంలో బ్యాటింగ్కు దిగే అవకాశం ఉంది. ఇదే విషయంపై డ్రెస్సింగ్రూమ్లో చర్చలు కూడా సాగాయి. హార్డ్ హిట్టింగ్ స్కిల్స్ ఉండటం వల్ల ఆరో స్థానంలో బ్యాటింగ్కు దిగితే- జట్టు స్కోరు మరింత పెరగడానికి కారణమౌతుందని విరాట్ కోహ్లీ సైతం అభిప్రాయపడ్డాడు. అతను బౌలింగ్ చేస్తాడా? లేదా? అనుమానమే. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లల్లో హార్దిక్ పాండ్యా ఒక్క బంతిని కూడా బౌల్ చేయలేదు. అతణ్ని బ్యాటర్గా మాత్రమే భావిస్తున్నామని కోహ్లీ స్పష్టం చేసిన నేపథ్యంలో- పాండ్యా బౌలింగ్ చేయకపోవచ్చు.