
షెడ్యూల్ ప్రకారమే ప్రపంచకప్:
మెగా టోర్నీ జరగనున్న ఆస్ట్రేలియాలో కరోనా బారిన పడిన సంఖ్య 5788 ఉండగా.. ఇప్పటివరకు 39 మంది మరణించారు. దీంతో టీ20 ప్రపంచకప్ జరగడంపై నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే ఐసీసీ తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. 'ప్రస్తుతం టోర్నమెంట్ షెడ్యూల్ ప్రకారం ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. టోర్నీ కోసం స్థానిక ఆర్గనైజింగ్ కమిటీ అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుంటుంది. తుది నిర్ణయం తీసుకునే ముందు కరోనా పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తుంది. ప్రస్తుతానికి టోర్నీ అనుకున్నట్లుగా జరుగుతుంది. ఇంకా 6 నెలల సమయం ఉంది. అప్పటివరకు పరిస్థితి చక్కబడుతుంది. షెడ్యూల్ ప్రకారం ఈవెంట్ ముందుకు సాగాలని కోరుకుంటున్నాం' అని ఐసీసీ పేర్కొంది.

ప్రపంచకప్కు పోటీ:
మరోవైపు అనుకున్న ప్రకారమే ప్రపంచకప్ను నిర్వహిస్తామని టీ20 ప్రపంచకప్ నిర్వాహక కమిటీ సీఈఓ నిక్ హాక్లీ స్పష్టం చేస్తున్నాడు. దేశంలో వాయిదా పడ్డ ఆస్ట్రేలియన్ ఫుట్బాల్ లీగ్, జాతీయ రగ్బీ లీగ్లతో ప్రపంచకప్కు పోటీ ఎదురయ్యే అవకాశముంది. అయినా సరే.. ముందుగా అనుకున్న ప్రకారమే ప్రపంచకప్ను నిర్వహిస్తామన్నారు. 2020 అక్టోబర్ 18 నుండి 2020 నవంబర్ 15 వరకు ఆస్ట్రేలియాలోని ఏడు వేదికలలో ప్రపంచకప్ టోర్నీ జరగనుంది.

అభిమానుల మద్దతుంది:
'టోర్నీ ఆరంభానికి దాదాపు ఇంకా 6 నెలల సమయం ఉంది కాబట్టి అన్నీ సర్దుకుంటాయనే అనుకుంటున్నా. ఒకవేళ పరిస్థితులు కుదురుకోకపోతే ఏం చేయాలనే విషయంపై కూడా ఆలోచిస్తున్నాం. ఐసీసీ, సభ్య దేశాలు, నిర్వాహక కమిటీతో చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ఏ ఫుట్బాల్, రగ్బీ లీగ్లను తిరిగి నిర్వహించాలనుకుంటే ప్రపంచకప్కు పోటీ తప్పదు. వాటి కంటే ప్రపంచకప్కే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. టిక్కెట్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. మాకు అభిమానుల మద్దతుంది' అని నిక్ తెలిపాడు.


Click it and Unblock the Notifications












