కరాచీ: ప్రపంచ కప్ ట్వంటీ 20లో భారత జట్టు చేతిలో ఓటమిపాలవడంతో పాకిస్తాన్ జట్టుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా కెప్టెన్ షాహిద్ ఆఫ్రిదిపై పాక్ క్రికెట్ బోర్డు (పిసిబి) ఆగ్రహంగా ఉందని తెలుస్తోంది.
భారత్ చేతిలో ఇప్పటికే వరుసగా పది ఓటములను చవిచూసిన తమ జట్టు ఈసారైనా గెలుస్తుందనుకుంటే మళ్లీ నిరాశే ఎదురవడంతో కెప్టెన్ అఫ్రిది పైన వేటు వేయాలని పిసిబి యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. సారథిగా అతణ్ని ఇంక ఎంతమాత్రమూ కొనసాగించరాదన్న నిర్ణయానికొచ్చినట్లు సమాచారం.
పొట్టి కప్పు తర్వాత తాను అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ పలికే అవకాశముందని అప్రిది టోర్నీ ఆరంభానికి ముందే చెప్పాడు. అయితే, ఆటగానిగా కెరీర్ చరమాంకలో ఉన్నా కూడా, ఆఫ్రిదిని ఉపేక్షించరాదని బోర్డు తుది నిర్ణయానికొచ్చినట్లు తెలుస్తోంది.

మ్యాచ్కు ముందు, తర్వాత అఫ్రిది మీడియాతో చేసిన వివాదాస్పద వ్యాఖ్యల పట్ల పిసిబి అసంతృప్తిగా ఉన్నట్లుగా తెలుస్తోంది.
పాక్లో కన్నా ఎక్కువగా భారత్లోనే తమకు ప్రేమాభిమానాలు దక్కుతాయని మ్యాచ్కు ముందు వ్యాఖ్యానించిన అప్రిది.. ఒత్తిడిలోనూ ఎలా ఆడాలో టీమ్ ఇండియాను చూసి నేర్చుకోవాలని ఓటమి తర్వాత అనడంతో పిసిబి మరింత ఆగ్రహంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. జట్టు సభ్యుడిగా కూడా అతడు కొనసాగే అవకాశాలు చాలా తక్కువని తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, భారత్తో మ్యాచ్ ఓడిన అనంతరం పాకిస్తాన్లో అభిమానులు కాస్ట్లీ టీవీలను కూడా పగులగొట్టారు. అఫ్రిది సేన పైన ధ్వజమెత్తుతున్నారు. మాజీ క్రికెటర్లు కూడా అఫ్రిది సేన పైన విమర్శలు చేస్తున్నారు.
మ్యాచ్ ఓడిన అనంతరం పెద్ద ఎత్తున అభిమానులు రోడ్ల పైకి వచ్చి.. తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. కొన్ని ప్రాంతాల్లో పాక్ జట్టును చూపిస్తున్న టీవీలను పగులగొట్టారు. కొన్ని ప్రాంతాల్లో పాక్ క్రికెటర్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారు తప్పుకోవాలని డిమాండ్ చేశారు.
బ్రయాన్ లారా మాట్లాడుతూ... స్పెషలిస్ట్ స్పిన్నర్ లేకపోవడాన్ని తప్పుబట్టాడు. అదే సమయంలో అఫ్రిది తీరును కూడా ప్రశ్నించాడు. పాకిస్తాన్ జట్టు తీరు తనను అసంతృప్తికి గురి చేసిందని చెప్పాడు. పాక్ మాజీ ఆటగాడు సక్లెయిన్ ముస్తాక్ మాట్లాడుతూ... భారత్ను ఓడించే మంచి అవకాశం కోల్పోయామని చెప్పాడు. మాజీ కెప్టెన్ రమీజ్ రాజా సెలక్షన్ కమిటీని తప్పుబట్టాడు.
మోహ్సిన్ ఖాన్.. కోహ్లీ, ధోనీలపై ప్రశంసలు కురిపించాడు. భారత్ పైన ఓడినందుకు పాకిస్తాన్ జట్టు పశ్చాత్తాపపడాలని మాజీ స్పిన్నర్ అబ్దుల్ ఖాదిర్ అన్నాడు. పాక్ మాజీ టెస్ట్ స్పిన్నర్ ఇక్బాల్ ఖాసీమ్ మాట్లాడుతూ.. భారత్ - పాక్ మ్యాచ్ను మీడియా చాలా హైప్ చేసిందని, ఇది సరికాదని చెప్పాడు.