
టీ20 ప్రపంచకప్లో ఐదుసార్లు:
భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో గత కొన్నేళ్లుగా ఇరు జట్ల మధ్య ధ్వైపాక్షిక సిరీస్లు జరగడం లేదు. కేవలం ఐసీసీ, ఆసియా కప్ టోర్నీల్లోనే దాయాది జట్లు తలపడుతున్నాయి. చివరగా 2012-13లో పరిమిత ఓవర్ల సిరీస్ కోసం భారత్లో పాక్ పర్యటించింది. 2008లో ఆసియా కప్ కోసం భారత్.. పాక్కు వెళ్లింది. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియాను పాకిస్తాన్ ఓడించింది. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత భారత్తో ఆడిన రెండు మ్యాచుల్లోనూ పాక్ ఓటమి పాలైంది. 2018 ఆసియా కప్, 2019 వన్డే ప్రపంచకప్ పోరులో పాక్ ఓడిపోయింది. టీ20 ప్రపంచకప్లో పాక్తో భారత్ ఐదుసార్లు ఆడింది. అందులో భారత్ నాలుగు గెలవగా.. ఓ మ్యాచ్ టై కాగా.. బౌల్ అవుట్లో టీమిండియానే గెలుపొందింది.

మీడియా, అభిమానులే:
టీ20 ప్రపంచకప్ 2021లో భాగంగా భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే పోరుకోసం అందరూ ఎదురుచూస్తున్నారు. ఇరు దేశాల క్రికెట్ అభిమానులతో పాటు ప్రస్తుత, మాజీ ఆటగాళ్లు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే భారత్, పాకిస్తాన్ మ్యాచ్పై సోషల్ మీడియా, అభిమానులు హైప్ క్రియేట్ చేస్తున్నారని పాకిస్తాన్ వికెట్ కీపర్ మొహమ్మద్ రిజ్వాన్ పేర్కొన్నాడు. తాజాగా విలేకరుల సమావేశంలో రిజ్వాన్ పాల్గొనగా.. భారత్, పాకిస్తాన్ మ్యాచ్ గురించి మీ అభిప్రాయం ఏంటని ఓ విలేకరి అడిగాడు. 'భారత్, పాకిస్తాన్ మ్యాచ్ను మేము సాధారణ మ్యాచులానే చూస్తున్నాం. సోషల్ మీడియా, అభిమానులు మాత్రమే హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇది బాగానే ఉంది కానీ ఆటగాళ్లపై ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల మ్యాచ్ ఓడిపోయే ప్రమాదం ఉంటుంది' అని రిజ్వాన్ అన్నాడు.

మా హోమ్ గ్రౌండ్ అయినా:
యూఏఈ గడ్డపై పాకిస్తాన్ చాలా క్రికెట్ ఆడినందున పాకిస్తాన్ అదనపు ప్రయోజనం పొందుతుందా అని మొహమ్మద్ రిజ్వాన్ను అడిగినప్పుడు... 'యూఏఈలో లేదా మరెక్కడైనా.. పాకిస్తాన్తో సహా ఏ జట్టుకైనా ప్రయోజనం ఉంటుందని నేను ఎప్పుడూ అనుకోను. నేను చెప్పేది ఏమిటంటే.. టోర్నమెంట్ ఆసియాలో జరుగుతోంది. యూఏఈ ఆసియాలో ఉన్నట్లు భావిస్తున్నా. మేము యూఏఈలో కొంతకాలంగా ఆడుతున్నాము. యూఏఈ మా హోమ్ గ్రౌండ్ అని చెప్పాము కానీ నేను దానిని అంగీకరించను. ఎందుకంటే.. యూఏఈలో ఉన్న పిచ్లు ఆస్ట్రేలియా లేదా ప్రపంచంలోని ఇతర ప్రాంతాల నుంచి తెచ్చిన మట్టితో తయారు చేయబడ్డాయి. అందుకే అందరికి అనుకూలంగా ఉండనున్నాయి' అని మొహమ్మద్ రిజ్వాన్ వివరించాడు.

మూడు మార్పులు:
ఇదివరకు ప్రకటించిన పాకిస్తాన్ జట్టులో పీసీబీ తాజాగా మూడు మార్పులను చేసింది. గతంలో ప్రకటించిన మహ్మద్ హస్నేన్, అజమ్ ఖాన్ స్థానాల్లో సర్ఫరాజ్ అహ్మద్, హైదర్ అలీలను తుది 15 మంది జట్టులోకి తీసుకుంది. రిజర్వ్ ఆటగాళ్లలో ఫఖర్ జమాన్ బదులుగా ఖుష్దిల్ షాను తీసుకున్నట్లు పాక్ క్రికెట్ బోర్డు తెలిపింది. ముందుగా ప్రకటించిన జట్టులో ఫఖర్ జమాన్ రిజర్వ్ ప్లేయర్ కాగా.. ఇప్పుడు తుది 15 మంది జట్టులోకి వచ్చాడు. అక్టోబర్ 10 వరకు ప్రకటించిన తుది జట్లలో మార్పులు, చేర్పులు చేసుకోవచ్చని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) పేర్కొన్న నేపథ్యంలో పీసీబీ మరోసారి తుది జట్టును ప్రకటించింది. ఇక సక్లెయిన్ ముస్తాక్ను తాత్కాలిక కోచ్గా నియమిస్తున్నట్లు పీసీబీ పేర్కొంది.

పాకిస్థాన్ టీ20 జట్టు:
బాబర్ అజామ్(కెప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), ఆసిఫ్ అలీ, ఫఖర్ జమాన్, హైదర్ అలీ, హరిస్ రఫ్, హసన్ అలీ, ఇమాద్ వసీమ్, మహ్మద్ హఫీజ్, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), మహ్మద్ వసీమ్ జూ, సర్ఫరాజ్ అహ్మద్, షహీన్ షా అఫ్రిది, షోయబ్ మాలిక్.
రిజర్వ్ ఆటగాళ్లు: ఖుష్దిల్ షా, షహ్నవాజ్ దహాని, ఉస్మాన్ ఖాదిర్.


Click it and Unblock the Notifications












