
హైదరాబాద్: డీవై పాటిల్ పేరుతో త్వరలో ముంబై టీ20 లీగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ లీగ్ కోసం నిర్వహించిన వేలంలో టీమిండియా రహానే, ముంబై ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ అత్యధికంగా రూ. 7లక్షల ధర పలికారు. వేలంలో రహానేను ముంబై నార్త్ జట్టు సొంతం చేసుకోగా, సూర్యకుమార్ను ముంబై నార్త్ ఈస్ట్ సొంతం చేసుకుంది.
వీరిద్దరి కోసం ప్రాంఛైజీలు పోటీ పడ్డాయి. దీంతో ఈ వేలంలో వీరిద్దరూ అత్యధిక ధర పలికిన ఆటగాళ్లుగా నిలిచారు. మరోవైపు టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మను రూ. 6 లక్షలకు ముంబై నార్త్ వెస్ట్ కొనుగోలు చేసింది. శ్రీలంకలో మార్చి 6 నుంచి 18 మధ్య జరిగే టీ20 ట్రైసిరీస్లో భారత జట్టుకు రోహిత్ సారథిగా వ్యవహరించనున్న సంగతి తెలిసిందే.
ముక్కోణపు టీ20 సిరిస్లో చోటు దక్కించుకోలేకపోయిన శ్రేయాస్ అయ్యర్ను ముంబై నార్త్ సెంట్రల్ రూ.5 లక్షలకు కొనుగోలు చేసింది. ఇటీవల ముగిసిన ఐసీసీ అండర్-19 ప్రపంచకప్లో టీమిండియాకు నాయకత్వం వహించిన పృథ్వీ షాను ముంబై నార్త్ రూ.2.80 లక్షలకు కోనుగోలు చేయగా, పేసర్ ధావళ్ కులకర్ణిని ముంబై నార్త్ ఈస్ట్ రూ.1.50 లక్షలకు వేలంలో సొంతం చేసుకుంది.
మార్చి 14 నుంచి ఇరానీ కప్ ప్రారంభం అవుతుండటంతో పృథ్వీ షా ఈ టీ20 లీగ్లో కొన్ని మ్యాచ్లు మాత్రమే ఆడే అవకాశం ఉంది. ఇటీవల ముగిసిన సఫారీ పర్యటనలో అద్భుత ప్రదర్శన చేసిన శార్దూల్ ఠాకూర్ ఈ వేలంలో అమ్ముడుపోని ఆటగాడిగా నిలిచాడు. వాంఖడే స్టేడియంలో మార్చి 11 నుంచి 21 మధ్య ఈ టీ20 లీగ్ జరగనుంది.
మార్చి 6 నుంచి శ్రీలంక వేదికగా జరిగే ముక్కోణఫు టీ20 సిరిస్లో శార్దూల్ ఠాకూర్ చోటు దక్కించుకోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఇక, ఆసక్తికర విషయం ఏంటంటే ముంబై రంజీ జట్టు కెప్టెన్ ఆదిత్య తారేను ఏ ప్రాంఛైజీ కొనుగోలు చేయలేదు. ఈ టీ20 లీగ్లో టీమిండియా మాజీ క్రికెటర్లు అమూల్ మజుందార్, వినోద్ కాంబ్లి, బల్విందర్ సింగ్ సంధు, లాల్చంద్ రాజ్పుత్లు జట్లకు మెంటార్లుగా వ్యవహారించనున్నారు.