హైదరాబాద్: శ్రీలంకతో జరుగుతున్న ఏకైక టీ20లో టీమిండియా వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని మరోసారి వికెట్ల వెనుక తన చురుకుతనాన్ని చూపాడు. రెప్పపాటు కన్నా తక్కువ సమయంలోనే మెరుపు వేగంతో శ్రీలంక బ్యాట్స్మన్ మాథ్యూస్ (7)ను స్టంపింగ్ చేశాడు.
ఇన్నింగ్స్ 6.3వ ఓవర్ వేసిన చాహల్ బౌలింగ్లో మాథ్యూస్ (7) హిట్టింగ్కి ప్రయత్నించిన సమయంలో వికెట్ని సమర్పించుకున్నాడు. చాహల్ విసిరిన బంతిని క్రీజు వెలుపలకి వచ్చి షాట్ కోసం మాథ్యూస్ ప్రయత్నించాడు. అయితే.. బంతి అనూహ్యంగా టర్న్ తీసుకుని ధోనీ చేతుల్లోకి వెళ్లింది.

వెంటనే అతను వికెట్లను గీరాటేయంతో మాథ్యూస్ నిరాశగా వెనుదిరిగాడు. టీవీ అంపైర్ తన నిర్ణయం ప్రకటించేందుకు కనీసం రెండు నిమిషాలు తీసుకున్నాడు. రిప్లేలో మాథ్యూస్ క్రీజులోకి వచ్చినట్లు కనిపించినా.. బెయిల్స్ని పడగొట్టిన సమయంలో అతని షూ గాల్లోనే ఉండటంతో థర్డ్ అంపైర్ అవుట్గా ప్రకటించాడు.
కొలంబో వేదికగా శ్రీలంకతో జరిగిన ఏకైక టి20లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆతిధ్య జట్టు నిర్దేశించిన 171 పరుగుల విజయలక్ష్యాన్ని భారత్ 19.2 ఓవర్లలో చేధించింది. శ్రీలంకతో జరిగిన ఏకైక టీ20 మ్యాచ్లో టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ(82), మనీశ్ పాండే(51 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించడంతో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రోహిత్ శర్మ 9, రాహుల్ 24, ధోనీ 1 పరుగులు చేశారు. కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
ఆస్ట్రేలియా రికార్డు సమం
ఈ విజయంతో కోహ్లీసేన మరో అద్భుత రికార్డుని నెలకొల్పింది. శ్రీలంకను టెస్టుల్లో 3-0తో, వన్డేల్లో 5-0తో క్లీన్స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. బుధవారం జరిగే ఏకైక టీ20లో కూడా గెలవడంతో 9-0తో శ్రీలంకను చిత్తుచేసిన జట్టుగా ఘన చరిత్ర సాధించింది. ఇంతకు ముందు ఇలాంటి ఘనత ఆస్ట్రేలియా మాత్రమే సాధించింది.
2009-10లో పాక్ను 3-0తో టెస్టుల్లో, 5-0తో వన్డేల్లో, 1-0తో టీ20లో ఓడించింది. ఇప్పుడు శ్రీలంకపై కోహ్లీసేన సరిగ్గా అలానే విజయం సాధించింది. దీంతో టీమిండియా చరిత్రలోనే ఇది ఓ మైలురాయిగా నిలిచింది.
భారత్ విజయ లక్ష్యం 171
అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి శ్రీలంక 170 పరుగులు చేసింది. దీంతో భారత్కు 171 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
దీంతో బ్యాటింగ్కు దిగిన లంకకు శుభారంభం లభించలేదు. ఓపెనర్ ఉపుల్ తరంగ (5) పరుగుల వద్ద భువనేశ్వర్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత 23 పరుగులకే మరో ఓపెనర్ డిక్వెలా (17)ను బుమ్రా పెవిలియన్కు చేర్చాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన దిల్షాన్ మునవీర 5 ఫోర్లు, 4 సిక్సులతో 53 పరుగులు చేశాడు.
క్రీజులోకి వచ్చినప్పటి నుంచి సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. దీంతో శ్రీలంక పవర్ ప్లే ముగిసే సరికి 2 వికెట్లు కోల్పోయి 60 పరుగులు చేసింది. ఆ తర్వాత జట్టు స్కోరు 113 పరుగుల వద్ద పెరీరా (11), శనక (0)ను చాహల్ అవుట్ చేశాడు.

చివర్లో క్రీజులోకి వచ్చిన అషాన్ ప్రియంజన్ (40 నాటౌట్) రెండు సిక్సర్లు బాది మెరవడంతో శ్రీలంక 7 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. భారత బౌలర్లలో యజువేంద్ర చాహల్ 3, అక్షర్ పటేల్ 2 వికెట్లు తీయగా, భువనేశ్వర్, బుమ్రా చెరో వికెట్ తీశారు.