
హైదరాబాద్: త్వరలో ఆరంభం కాబోతున్న ముంబై టీ20 లీగ్ కుర్రాళ్లకు చక్కని వేదిక అని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అభిప్రాయపడ్డారు. వాంఖడే స్టేడియంలో మార్చి 11వ తేదీ నుంచి 21 వరకు జరగబోయే టీ20ల ప్రారంభ వేడుకకు సచిన్ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ముంబై టీ 20లీగ్ను కొనియాడారు. లీగ్ పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ముంబై క్రికెట్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తోన్న సచిన్ గురువారం ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని విలువైన సలహాలు, సూచనలు ఇచ్చారు. లీగ్ ఏర్పాటు పట్ల చాలా సంతోషంగా ఉన్నాను. ఇలాంటి టోర్నీల వల్ల రాష్ట్రంలో ప్రతిభ కల్గిన యువకులకు మంచి అవకాశం దొరుకుతుంది. తమ నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు టీ20 లీగ్ను వేదికగా మలుచుకోవాలి' అని సూచించారు.
ఇంకా మాట్లాడుతూ.. 'ముంబై క్రికెట్కు ఇలాంటివి ఎంతో అవసరం. శివాజీ పార్క్ నుంచి నా క్రికెట్ ప్రస్థానం మొదలైంది. రమాకాంత్ అచ్రేకర్, పద్మాకర్ శివాల్కర్ లాంటి గురువుల వద్ద శిష్యరికంతో ఈ స్థాయికి ఎదిగాను. భారత క్రికెట్కు ముంబై నాయకత్వం ఎప్పుడూ కావాల్సిందే. ఇది గతంలోనూ చాలా సందర్భాల్లో రుజువు అయ్యింది. ఎంతో మంది క్రికెటర్లు జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు' అని సచిన్ అన్నాడు.
టీ20 ముంబై లీగ్ క్రికెట్ అభిమానులను అలరించేందుకు మాత్రమే కాదని యువ క్రికెటర్లు తమ సత్తాను చాటుకునేందుకు వచ్చిన గొప్ప అవకాశమని సచిన్ పేర్కొన్నాడు. ముంబై నార్త్, ముంబై నార్త్-వెస్ట్, ముంబై నార్త్-ఈస్ట్, ముంబై నార్త్ సెంట్రల్, ముంబై సౌత్ సెంట్రల్, ముంబై సౌత్ జట్లు ఈ లీగ్లో తలపడనున్నాయి. అంతేకాదు ముంబై టీ20 లీగ్లో పాల్గొనేందుకు ముంబై క్రికెట్ అసోసియేషన్ సపోర్టింగ్ స్టాఫ్ కోసం నోటఫికేషన్ విడుదల చేసింది. దానిని ట్విట్టర్ ద్వారా ప్రచారం చేయనుంది.