
బ్రిస్బేన్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 ప్రారంభం నుంచి వచ్చిన ప్రతీ అవకాశాన్ని టీమిండియా పేసర్ టీ నటరాజన్ సద్వినియోగం చేసుకుంటున్నాడు. తాజాగా టీమిండియా పరిమిత ఓవర్ల క్రికెట్లోకి అరంగేట్రం చేసి సత్తాచాటిన నట్టూ.. టెస్టు క్రికెట్లోకి అనూహ్యంగా దూసుకొచ్చి తనకు ఏ ఫార్మాట్ అయినా ఒకటేనని చాటిచెప్పాడు. ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న చివరిదైన నాలుగో టెస్టులో చోటు దక్కించుకుని టెస్టుల్లో అరంగేట్రం చేసిన నటరాజన్.. తొలి ఇన్నింగ్స్లో మూడు వికెట్లతో (3/78) దుమ్ములేపాడు.
బ్రిస్బేన్ టెస్టులో మార్నస్ లబూషేన్, మాథ్యూ వేడ్లతో పాటు జొష్ హజిల్వుడ్ వికెట్ను టీ నటరాజన్ సాధించాడు. దాంతో ఒక అరుదైన జాబితాలో నటరాజన్ చేరిపోయాడు. అరంగేట్ర టెస్టులో రెండో అత్యుత్తమ ప్రదర్శన (3/78) చేసిన భారత లెఫ్మార్మ్ సీమర్గా నిలిచాడు. అంతకుముందు ఆర్పీ సింగ్ 2004-05 సీజన్లో పాకిస్థాన్ పర్యటన సందర్భంగా ఫైసలాబాద్ టెస్టులో (4/89) మెరుగైన ప్రదర్శన చేశాడు. ఇది భారత్ తరఫున లెఫ్టార్మ్ పేసర్లలో తొలి టెస్టులో అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది. ఆ తర్వాత నటరాజన్ నిలిచాడు.
టీ నటరాజన్ ఐపీఎల్ 2020లో ఆకట్టుకోవడంతో టీమిండియా నుంచి పిలుపు వచ్చింది. తొలుత ఆస్ట్రేలియా పర్యటనకు నెట్బౌలర్గా ఎంపికయ్యాడు. ఆపై అనుకోకుండానే ఈ పర్యటనలో నటరాజన్ మూడు ఫార్మాట్లలో అరంగేట్రం చేశాడు. దీంతో భారత్ తరఫున ఈ రికార్డు సృష్టించిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. అలాగే ప్రపంచ వ్యాప్తంగా 17వ ఆటగాడిగా నిలిచాడు. నటరాజన్కు తొలుత మూడో వన్డేలో అవకాశం రావడంతో రెండు వికెట్లు తీశాడు. ఆ ప్రదర్శనతో టీ20 జట్టులో అడుగుపెట్టాడు. 6 వికెట్లు తీయడంతో భారత్ సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక టెస్టు సిరీస్లో భారత ప్రధాన పేసర్లంతా గాయపడడంతో నటరాజన్కు ఈ ఫార్మాట్లోనూ అవకాశం వచ్చింది.
నాలుగో టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. వర్షం కారణంగా మూడో సెషన్ ఆట సాగలేదు. టీ బ్రేక్ అనంతరం భారీ వర్షం కురవడంతో మ్యాచ్ నిలిచిపోయింది. మైదానం చిత్తడిగా మారడంతో మ్యాచ్ సాగేందుకు వీలుకాలేదు. రెండో రోజు ముగిసే సమయానికి 26 ఓవర్లలో టీమిండియా రెండు వికెట్లు కోల్పోయి 62 పరుగులు చేసింది. ఛెతేశ్వర్ పుజారా (8), అజింక్య రహానే (2) క్రీజులో ఉన్నారు. శుభ్మన్ గిల్ (7; 15 బంతుల్లో 1x4), రోహిత్ శర్మ (44; 74 బంతుల్లో 6x4 )ఔట్ అయ్యారు. అంతకుముందు జట్టు స్కోర్ 274/5 పరుగుల దగ్గర రెండో రోజు ఆట ప్రారంభించిన ఆసీస్.. 369 పరుగులకు ఆలౌట్ అయింది. మరో 95 పరుగులు జోడించి మిగతా ఐదు వికెట్లు కోల్పోయింది.