టీమిండియా ఎమర్జింగ్ ప్లేయర్, తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ సయ్యద్ ముష్తాక్ అలీ టీ20 ట్రోఫీలో సెంచరీతో అదరగొట్టాడు. ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడిన తిలక్.. మైదానంలో బౌండరీల సునామీ సృష్టించాడు. 16 ఫోర్లు, 4 సిక్స్ల సహాయంతో కేవలం 69 బంతుల్లోనే 121 పరుగులు చేసి చివరి వరకు నాటౌట్గా నిలిచాడు .
సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ కోసం హైదరాబాద్ జట్టు 20 ఏళ్ల నంబూరి ఠాకూర్ తిలక్ వర్మను తమ జట్టు కెప్టెన్గా ప్రకటించింది. కెప్టెన్గా తొలి సిరీస్ అయినా.. అటు కెప్టెన్గా, ఇటు ప్లేయర్గా తిలక్ వర్మ ఫుల్ ఫామ్తో చేలరేగుతున్నాడు.

మేఘాలయతో జరిగిన తొలి మ్యాచ్లో 31 బంతుల్లో 41 పరుగులు చేసిన తిలక్ వర్మ.. జమ్మూ&కాశ్మీర్పై ఆడిన రెండో మ్యాచ్లో 43 బంతుల్లో 58 పరుగులు సాధించాడు. అయితే మూడో మ్యాచ్లో ఛత్తీస్గఢ్పై 11 పరుగులకే అవుటై నిరాశపరిచినా.. నాలుగో మ్యాచ్లో మిజోరంపై 24 బంతుల్లోనే 40 పరుగులతో మెరుపులు మెరిపించాడు. ఇక ఇప్పుడు ఏకంగా బరోడాపై సెంచరీతో కదం తొక్కాడు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తిలక్ వర్మ అజేయ సెంచరీ చేసినా.. మిగిలిన బ్యాటర్లు అంతగా రాణించకపోవడంతో పాటు బరోడా కెప్టెన్ క్రునాల్ పాండ్యా 36 బంతుల్లో 64, విష్ణు సోలంకి 37 బంతుల్లో 71 చెలరేగడంతో హైదరాబాద్కు ఓటమి తప్పలేదు. హైదరాబాద్ సెట్ చేసిన 187 పరుగుల టార్గెట్ను బరోడా 18.2 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
ఇదిలా ఉంటే ఇప్పటివరకు తిలక్ వర్మ టీమిండియా తరుపున ఒక వన్డే, 10 టీ 20లు ఆడాడు. టీ20ల్లో ఇండియా తరుఫున తిలక్ 2 హాఫ్ సెంచరీలు కూడా బాదాడు. అలాగే 2 వికెట్లు కూడా తీసుకున్నాడు. ఇక ఐపీఎల్లో ముంబయి ఇండియన్స్ తరపున తిలక్ ఎన్నో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.