
హైదరాబాద్: సిక్సర్ల కింగ్ ఫిట్నెస్ టెస్ట్లో పాసై తిరిగొచ్చాడు. మళ్లీ అదే స్థాయిలో ఆటలో విరుచుకుపడుతున్నాడు. భారత జట్టులో చోటు కోసం ఆశగా ఎదురుచూస్తోన్న గౌతం గంభీర్తో పాటుగా యువరాజ్ సింగ్ కూడా ఉన్నారు. ఇటీవల యో యో పాసైన యువీ ఇంకా ఫిట్నెస్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడని, దేశవాళీ క్రికెట్లో ఆడకపోవడం వల్లే భారత జట్టుకు ఎంపిక చేయలేకపోతున్నామని చెప్పాడు బీసీసీఐ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్.
తాజాగా యువరాజ్.. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో ఢిల్లీపై జరిగిన మ్యాచ్లో అర్ధశతకాన్ని సాధించాడు. టోర్నీలో భాగంగా ఫిరోజ్ షా కోట్లా మైదానంలో పంజాబ్ వర్సెస్ ఢిల్లీలకు మంగళవారం మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది.
పంజాబ్ ఆటగాళ్లు మనన్ ఓహ్రా (74, 50బంతుల్లో), యువరాజ్ సింగ్ (50, 40 బంతుల్లో) రాణించడంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. అనంతరం 171 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ ఆఖరి వరకు పోరాడింది. ఢిల్లీ తరఫున ఓపెనర్గా వచ్చిన గౌతం గంభీర్(66, 54 బంతుల్లో) ఒంటరి పోరాటం చేశాడు. దీంతో ఈ జట్టు కేవలం రెండు పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
ఈ మ్యాచ్లో ఏ జట్టు విజయం సాధించినప్పటికీ ఇప్పుడు అందరూ యువరాజ్, గంభీర్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఐపీఎల్2018 సీజన్ కోసం యువరాజ్, గంభీర్ను సన్రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్రైడర్స్ అట్టిపెట్టుకోకుండా వేలానికి వదిలేసింది. దీంతో తమ సత్తా ఏమాత్రం తగ్గలేదని ఇలా నిరూపించుకున్నారని పలువురు క్రీడా విశ్లేషకులు తెలిపారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.