దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ విధ్వంసం సృష్టించాడు. తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తూ మేఘాలయపై శతకంతో కదం తొక్కాడు. 67 బంతుల్లో ఏకంగా 151 పరుగులు బాదాడు. 14 ఫోర్లు, 10 సిక్సర్లతో ఊచకోతకు దిగాడు. టీ20ల్లో తిలక్కు వరుసగా ఇది మూడో సెంచరీ. దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్లో చివరి రెండు మ్యాచ్ల్లోనూ తిలక్ శతకం సాధించిన సంగతి తెలిసిందే.
దక్షిణాఫ్రికా మూడు, నాలుగో టీ20ల్లో వన్డౌన్లో వచ్చిన అతను అజేయంగా 107, 120 పరుగులు బాదాడు. కాగా, మేఘాలయతో జరిగిన మ్యాచ్లోనూ తిలక్ మూడో స్థానంలోనే బ్యాటింగ్కు వచ్చాడు. కాగా, గత పది రోజుల్లో మూడు శతకాలు బాదిన తిలక్ వర్మ అరుదైన ఘనతలు సాధించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అత్యధిక స్కోరు సాధించిన క్రికెటర్గా హైదరాబాద్ కెప్టెన్గా తిలక్ చరిత్రకెక్కాడు.

అంతకుముందు ఈ రికార్డు శ్రేయస్ అయ్యర్ పేరిట ఉండేది. శ్రేయస్ ముంబై తరఫున 2019లో సిక్కింతో జరిగిన మ్యాచ్లో 55 బంతుల్లో 147 పరుగులు చేశాడు. కాగా, మెన్స్ టీ20ల్లో 150 పరుగుల మార్క్ అందుకున్న తొలి భారత క్రికెటర్గానూ తిలక్ రికార్డులకెక్కాడు. అంతేగాక టీ20 ఫార్మాట్లో వరుసగా మూడు సెంచరీలు చేసిన తొలి ఇండియన్ ప్లేయర్గానూ చరిత్ర సృష్టించాడు. ఇక మేఘాలయతో జరిగిన మ్యాచ్ విషయానికొస్తే.. హైదరాబాద్ 180 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది.
కెప్టెన్ తిలక్ వర్మతో పాటు తన్మయ్ అగర్వాల్ (55; 23 బంతుల్లో, 4 ఫోర్లు, 5 సిక్సర్లు) కూడా చెలరేగడంతో.. మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 248 పరుగులు చేసింది. మేఘాలయ బౌలర్లలో డిప్పు సిగ్మా రెండు వికెట్లు, ఆకాశ్ చౌదరి ఒక వికెట్ తీశారు. అనంతరం ఛేదనలో మేఘాలయ 15.1 ఓవర్లలో 69 పరుగులకే ఆలౌటైంది. అర్పిత్ సుభాష్ (27) టాప్ స్కోరర్. అంకిత్రెడ్డి నాలుగు, త్యాగరాజన్ మూడు వికెట్లు తీశారు. ఈ టోర్నీలో మొత్తం 38 జట్లు అయిదు గ్రూప్లుగా పాల్గొంటున్నాయి. గ్రూప్-ఏలో హైదరాబాద్ ఉంది.