
హైదరాబాద్: ఐపీఎల్-11 వేలానికి ముందు సీనియర్ క్రికెటర్లతో పాటు, యువ కెరటాలు సత్తా చాటేందుకు సన్నద్ధమయ్యారు. నేటినుంచి జరిగే సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నీ సూపర్ లీగ్ దశలో పలువురు అగ్రశ్రేణి, వర్ధమాన క్రికెటర్లు పాల్గొంటున్నారు. ఐపీఎల్లో గత జట్లు తమను కొనసాగించకపోవడంతో యువరాజ్, గంభీర్, హర్భజన్వంటి సీనియర్లు వేలంలోకి వస్తున్నారు.
జనవరి 27,28 తేదీల్లో జరగనున్న ఈ వేలానికి 1000 మందికి పైగా రిజిష్టర్ చేసుకోగా వారిలో 573 మందికి బీసీసీఐ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. కాగా, రిటెన్షన్ లిస్ట్ లోనూ ప్రమోషన్ విషయంలోనూ ముందంజలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ మంచి జోరు మీద సాగుతుంది.
అయితే సీనియర్ ప్లేయర్లు అయిన హర్బజన్, యువరాజ్, గంభీర్ ముస్తఖ్ అలీ టోర్నీలో చెలరేగి ఫ్రాంచైజీల దృష్టిలో పడాలని చూస్తున్నారు. ఇక యువ ఆటగాళ్లలో ఇటీవల 32 బంతుల్లో సెంచరీ సాధించిన రిషభ్ పంత్పై మరో సారి అందరి దృష్టి నిలిచింది. నేటి నుంచి కోల్కతా వేదికగా జరుగనున్న ఈ టోర్నీ సూపర్ లీగ్లో 10 జట్లు రెండు గ్రూపులుగా రౌండ్ రాబిన్ ఫార్మాట్లో బరిలో దిగనున్నాయి.
గ్రూప్ 'ఎ'లో పంజాబ్, కర్ణాటక, జార్ఖండ్, ముంబై, రాజస్తాన్; గ్రూప్ 'బి'లో ఢిల్లీ, తమిళనాడు, బెంగాల్, బరోడా, ఉత్తరప్రదేశ్ జట్లు ఉన్నాయి. ఆదివారం జరిగే మ్యాచ్ల్లో తమిళనాడుతో ఢిల్లీ, బరోడాతో బెంగాల్, కర్ణాటకతో పంజాబ్, జార్ఖండ్తో ముంబై తలపడనున్నాయి.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.