మనీశ్ పాండే అర్ధ సెంచరీ
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన కర్ణాటక నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 180 పరుగులు చేసింది. మనీశ్ పాండే అర్ధ సెంచరీ సాధించగా.. సహా రోహన్ కదమ్ (28 బంతుల్లో 35; 5 ఫోర్లు), దేవదత్ పడిక్కల్ (23 బంతుల్లో 32; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. తమిళనాడు బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్, మురుగన్ అశ్విన్ చెరో రెండు వికెట్లు తీశారు.
ఆదుకున్న శంకర్
లక్ష్య ఛేదనలో తమిళనాడు 6వికెట్లు కోల్పోయి 179 పరుగులే చేసింది. ఒక దశలో 80 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును బాబా అపరజిత్ (40, 25 బంతుల్లో; 1×4, 3×6), విజయ్ శంకర్ (44, 27 బంతుల్లో; 5×4) ఆదుకున్నారు. జోడి ఫోర్లు, సిక్సర్లతో కర్ణాటక బౌలర్లపై విరుచుకుపడి ఐదో వికెట్కు 71 పరుగులు జోడించారు.
6 బంతుల్లో 13 పరుగులు
అయితే రోనిట్ బౌలింగ్లో (2/32) అపరజిత్ పెవిలియన్కు చేరినా.. రవిచంద్రన్ అశ్విన్ (16*, 9 బంతుల్లో; 3×4) దూకుడుగా ఆడాడు. దీంతో తమిళనాడు విజయ సమీకరణం 6 బంతుల్లో 13 పరుగులుగా మారింది. కృష్ణప్ప గౌతమ్ (1/31) వేసిన ఆఖరి ఓవర్ తొలి రెండు బంతుల్ని అశ్విన్ బౌండరీకి తరలించాడు. దీంతో తమిళనాడు విజయం నల్లేరు మీద నడకే అనుకున్నారు. కానీ గౌతమ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసాడు.
పాండేకు పెళ్లి కానుక
గౌతమ్ మూడు, నాలుగు బంతులకు ఒకే పరుగు ఇచ్చాడు. ఐదో బంతికి రెండో పరుగు తీసే ప్రయత్నంలో విజయ్ శంకర్ రనౌటయ్యాడు. ఇక చివరి బంతికి మూడు పరుగులు కావాల్సి ఉండగా.. సింగిల్ మాత్రమే రావడంతో కర్ణాటక విజయం ఖాయమైంది. దీంతో సోమవారం పెళ్లి చేసుకోబోతున్న కెప్టెన్ మనీశ్ పాండేకు జట్టు చక్కటి బహుమతిని అందించింది.
ఓ ఆటగాడిని సంప్రదించిన బుకీ
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నమెంట్లోనూ ఓ ఆటగాడిని బుకీ సంప్రదించినట్టు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెలిపాడు. అయితే ఆ క్రికెటర్ ఎవరనేది తనకు తెలీదని, వెంటనే అతడు బోర్డు అవినీతి నిరోధక యూనిట్కు ఫిర్యాదు చేసినట్టు దాదా చెప్పాడు. బుకీలు సంప్రదించడం మామూలే అయినా.. ఆతర్వాత ఆటగాళ్లు ఏం చేస్తారనేదే పెద్ద సమస్యగా మారిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశాడు.