

హైదరాబాద్: 'టెస్టు బ్యాట్స్ మన్' అనే ముద్ర ఉండటంతో ఐపీఎల్ 2019 సీజన్ కోసం గత డిసెంబర్లో నిర్వహించిన ఐపీఎల్ వేలంలో టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్మన్ ఛటేశ్వర్ పుజారాని ఏ ప్రాంఛైజీ కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబర్చలేదు. అయితే, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా రైల్వేస్తో జరిగిన మ్యాచ్లో చెలరేగాడు.
ఈ మ్యాచ్లో పూజారా టీ20ల్లో తొలి సెంచరీ నమోదు చేశాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా రైల్వేస్తో జరిగిన మ్యాచ్లో పుజారా కేవలం 61 బంతుల్లో 100 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. పుజారా ఇన్నింగ్స్లో 14 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. పుజారా సెంచరీ సాధించడంతో సౌరాష్ట్ర నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 188 పరుగులు చేసింది.
ఈ మ్యాచ్లో ఓపెనర్గా వచ్చిన పుజారా మొత్తం 20 ఓవర్ల పాటు క్రీజులో ఉండటం విశేషం. ఈ ఇన్నింగ్స్తో తనపై ఉన్న టెస్ట్ స్పెషలిస్ట్ ముద్రను పుజారా తొలగించుకున్నాడు. అంతేకాదు సౌరాష్ట్ర తరుపున టీ20ల్లో సెంచరీ నమోదు చేసిన తొలి బ్యాట్స్మన్గా పుజారా అరుదైన గుర్తింపు పొందాడు.
అంతేకాదు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సెంచరీ సాధించిన నాలుగో బ్యాట్స్మన్ కావడం విశేషం. అంతకముందు వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్లు సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో ఉన్నారు. ఈ మ్యాచ్లో పుజారా రాబిన్ ఊతప్ప(31 బంతుల్లో 46)తో కలిసి 82 పరుగుల బాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.