
సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారత్ రెండో వికెట్ కోల్పోయింది. యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ (50; 101 బంతుల్లో 8x4) హాఫ్ సెంచరీ చేసి ఔటయ్యాడు. పేసర్ పాట్ కమిన్స్ వేసిన 32.1 ఓవర్కు గల్లీ పాయింట్లో కామెరూన్ గ్రీన్ చేతికి చిక్కాడు. దీంతో భారత్ 85 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. గిల్ మెల్బోర్న్లో జరిగిన బాక్సింగ్ డే టెస్టులోనూ (45, 35*) అద్భుత ప్రదర్శన చేశాడు. దీంతోనే సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ జట్టులోకి వచ్చినా.. మయాంక్ అగర్వాన్పై వేటుపడింది. మూడో టెస్టుకు ఎంపికైన గిల్.. జట్టుకు శుభారంభం అందించాడు.
అంతకుముందు గాయం నుంచి కోలుకొని నేరుగా ఈ మ్యాచ్లోనే ఆడుతున్న స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ (26; 77 బంతుల్లో 3x4, 1x6) జోష్ హేజిల్వుడ్ బౌలింగ్లో ఔటయ్యాడు. అంతకుముందే రోహిత్కు ఓ జీవనాధారం లభించింది. స్పిన్నర్ నాథన్ లైయన్ వేసిన 24వ ఓవర్లో రోహిత్ బ్యాట్, గ్లౌజులకు ఓ బంతి తాకినట్లు అనిపించడంతో షార్ట్లెగ్లోని ఫీల్డర్ క్యాచ్ అందుకున్నాడు. దానికి అంపైర్ ఔటివ్వగా.. రోహిత్ రివ్యూకు వెళ్లాడు. అక్కడ నాటౌట్గా తేలడంతో ఊపిరి పీల్చుకున్నాడు. కానీ కాసేపటికే హేజిల్వుడ్ వేసిన 27వ ఓవర్ చివరి బంతికి రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
ఓపెనర్ల నిష్క్రమణ అనంతరం టెస్ట్ స్పెషలిస్ట్ ఛెతేశ్వర్ పుజారా, కెప్టెన్ అజింక్య రహానే క్రీజులో ఉన్నారు. ఇద్దరూ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నారు. ఆసీస్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నారు. 42 ఓవర్లకు భారత్ స్కోర్ 96/2గా ఉంది. ప్రస్తుతం క్రీజులో పుజారా (9), రహానే (5) పరుగులతో ఉన్నారు. ఆసీస్ మొదటి ఇన్నింగ్స్ స్కోరుకు భారత్ ఇంకా 242 పరుగులు వెనకపడి ఉంది.
అంతకుముందు తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. భారత బౌలర్లు రాణించడంతో ఆసీస్ 105.4 ఓవర్లలో 338 పరుగులకు ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్మెన్ స్టీవ్ స్మిత్ (131; 226 బంతుల్లో 16 ఫోర్లు) శతకం చేశాడు. మార్కస్ లబుషేన్ (91: 196 బంతుల్లో 11x4), విల్ పకోస్కీ (62; 110 బంతుల్లో 4x4) హాఫ్ సెంచరీలు బాదారు. భారత బౌలర్స్లో రవీంద్ర జడేజా నాలుగు వికెట్స్ తీశాడు.