సిడ్నీ: ఆస్ట్రేలియా - భారత్ సెమీ ఫైనల్ నేపథ్యంలో సిడ్నీ పిచ్ చర్చనీయాంశమవుతోంది. సోమవారం పిచ్ను తనిఖీ చేసిన ఆస్ట్రేలియా సారథి మైకేల్ క్లార్క్ అసంతృప్తిగా కనిపించాడు. పిచ్ పొడిగా, నిర్జీవంగా కనిపించింది. ఇది డిఫెండింగ్ ఛాంపియన్ భారత జట్టుకు సానుకూలంశంగా ఉంటుంది.
పిచ్ ఏమాత్రం స్పిన్కు అనుకూలించినా సద్వినియోగం చేసుకునేందుకు రవీంద్ర జడెజా, అశ్విన్లు భారత జట్టుకు ఉన్నారు. ఇది ఆస్ట్రేలియాకు కంగారు పుట్టించే అంశమనే చెప్పవచ్చు. కోచ్, ఐసీసీ క్యురేటర్తో కలిసి క్లార్క్ పిచ్ను పరిశీలించాడు. పిచ్ తీరు పైన కొంత కంగారుగా కనిపించినట్లుగా అతని చూపులు ఉన్నాయి. అనంతరం కోచ్తో కాసేపు మాట్లాడాడు.
సెమీస్ నెగ్గితే కప్ మనదే: మిథాలి రాజ్
సెమీస్లో ఆస్ట్రేలియాతో భారత జట్టు నెగ్గితే మనం కప్పు గెలిచినట్లేనని మిథాలి రాజ్ అన్నారు. ఇప్పటి వరకు ఆస్ట్రేలియా ఆటతీరు అద్భుతంగా ఏమీ లేదన్నారు. అదే సమయంలో భారత జట్టు అన్నింటా రాణిస్తోందన్నారు. పాకిస్తాన్తో మ్యాచ్ మినహా కోహ్లీ ఇంకా తన స్థాయికి తగ్గట్లుగా ఆడుతున్నాడన్నారు. ప్రపంచ కప్ ముందుతో పోలిస్తే బౌలర్లలో చాలా తేడా కనిపిస్తోందన్నారు.

కాగా, భారత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్ సురేష్ రైనా సోమవారం టెన్నిస్ బంతులతో నెట్ ప్రాక్టీస్ చేశాడు. షార్ట్పిచ్ బంతులను సమర్థంగా ఎదుర్కొనేందుకు వీలుగా నెట్స్లో అతనితో టెన్నిస్ బంతితో కోచ్ డంకన్ ఫ్లెచర్ ప్రాక్టీస్ చేయించాడు. ఈనెల 26న జరిగే ప్రపంచ కప్ క్రికెట్ చాంపియన్షిప్ సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది. ఆసీస్ పేసర్లు మిచెల్ జాన్సన్, మిచెల్ స్టార్క్ షార్ట్ పిచ్ బంతులతో భారత బ్యాట్స్మెన్ను ఇబ్బంది పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
మిగతా బ్యాట్స్మెన్ విషయం ఎలావున్నా షార్ట్పిచ్ బంతులను ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు రైనా తడబడుతున్నాడు. ఈ అంశాన్నే ప్రధానంగా ప్రస్తావిస్తూ అతని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయ వద్దని కెప్టెన్ ధోనీ మీడియా ప్రతినిధులను కోరడమే రైనా పరిస్థితికి అద్దం పడుతుంది. టెన్నిస్ బంతులతో ప్రాక్టీస్ చేయడం బ్యాట్స్మెన్కు కొత్తకాదు. అయితే, రైనాతో ప్రాక్టీస్ చేయించడానికి కోచ్ డంకన్ ఫ్లెచర్ వినూత్న పంథాను ఎంచుకున్నాడు.
సిడ్నీ మైదానంలో మూడు నెట్స్ ఉంటే, ఒక నెట్లో పేసర్లు, మరో నెట్లో స్పిన్నర్లను బ్యాట్స్మెన్ ఎదుర్కొన్నారు. మూడో నెట్కు రైనాను తీసుకెళ్లిన ఫ్లెచర్ అతనికి టెన్నిస్ బంతులను విసరకుండా, టెన్నిస్ ర్యాకెట్ (బ్యాట్)తో బలంగా కొడుతూ ప్రాక్టీస్ చేయించాడు. సుమారు 20 నిమిషాల సెషన్ తర్వాత, కెప్టెన్ ధోనీని పిలిచాడు. అతను మరింత బలంగా ర్యాకెట్తో టెన్నిస్ బంతులను రైనా శరీరాన్ని లక్ష్యంగా చేసుకొని విసరడం ఆరంభించాడు.
ఫ్లెచర్ కొట్టిన బంతులు రైనాను పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. అతను కొన్నింటిని కొట్టి, మరికొన్నింటిని విడిచిపెట్టాడు. అయితే, ధోనీ బంతుల్లో ఎక్కువ శాతం వేగంగా వచ్చి రైనాకు తగిలాయి. చాలా బంతులను అతను ఆడలేకపోయాడు. పరిస్థితి గమనించిన ధోనీ.. రైనాను వెంట తీసుకెళ్లి, మైదానంలో నడుస్తూ ముచ్చటించాడు. తిరిగి కొంత సేపు నెట్ ప్రాక్టీస్ కొనసాగింది.
మొత్తం మీద రైనా 45 నిమిషాలు నెట్స్లో గడిపాడు. ధావన్ కూడా టెన్నిస్ బంతులతో ప్రాక్టీస్ చేశాడు. మరోవైపు, ప్రపంచ కప్లో ఇప్పటి వరకూ 17 వికెట్లు పడగొట్టిన మీడియం పేసర్ మహమ్మద్ షమీ సోమవారం నెట్స్కు హాజరుకాలేదు. అతని ఫిట్నెస్కు ఎలాంటి సమస్య లేదని, తగినంత విశ్రాంతినివ్వాలనే ప్రాక్టీస్ సెషన్కు దూరంగా ఉంచామని మేనేజ్మెంట్ ప్రకటించింది.