లండన్: ఇంగ్లాండ్ కౌంటీ ఆటగాడు, ససెక్స్ క్రికెటర్ మాథ్యూ హోబ్డెన్(22) శనివారం రాత్రి మృతిచెందాడు. ఈ విషయాన్ని ఇంగ్లాండ్ కౌంటీ క్లబ్ ఆదివారం వెల్లడించింది. అయితే, మృతికి గల కరణాలను తెలియజేయలేదు. మాథ్యూ హోబ్డెన్ ఈస్ట్ బార్న్లో జన్మించాడు. 2014లో కౌంటీ క్రికెట్ కెరీర్ ప్రారంభించిన ఫాస్ట్ బౌలర్ హోబ్డెన్ మూడు ఫార్మాట్లలోనూ మ్యాచులు ఆడాడు.
గత ఆగస్టులో ఎస్సెక్స్ తో జరిగిన మ్యాచ్ లో చివరిసారిగా మైదానంలో కనపించాడని క్లబ్ పేర్కొంది. సస్సెక్స్ తరఫున ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడిన హోబ్డెన్ 39.35 సగటుతో 48 వికెట్లు పడగొట్టాడు. 11 కౌంటీ మ్యాచుల్లో 48.43 సగటుతో 23 వికెట్లు తీశాడు.
కాగా, ఇంగ్లండ్ ఆటగాళ్లు ఇయాన్ మోర్గాన్, రవి బొపారా, మాట్ ప్రియర్ హోబ్డెన్ కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. హోబ్డెన్ కుటుంబం, మిత్రులకు ఇది గడ్డుకాలమని పేర్కొంటూ ట్వీట్ చేశారు.
హోబ్డెన్ అతిపిన్న వయసులో చనిపోవడంపై సస్సెక్స్ జట్లు అతడి మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి చెందింది. గత రెండు సీజనల్లో సస్సెక్స్ జట్టులో ఉంటూ అన్ని ఫార్మాట్లలో ఆటను కొనసాగించాడు. మాథ్యూ యువ బౌలర్, మంచి ప్రతిభ గల ఆటగాడని ప్రొఫెషనల్ క్రికెట్ అసోసియేషన్ సీఈవో అంగస్ పోర్టర్ స్పందించారు.