
హైదరాబాద్: పాకిస్థాన్తో ఎట్టిపరిస్థితుల్లో ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్లు ఆడే ప్రసక్తే లేదని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ స్పష్టం చేశారు. సోమవారం ఆమె విదేశాంగశాఖకు చెందిన పార్లమెంట్ కన్సల్టేటివ్ కమిటీ సమావేశంలో మాట్లాడారు.
సరిహద్దుల్లో ఉగ్రవాదం ఆపనంత వరకు తటస్థ వేదిక మీద కూడా ఇరు జట్ల మధ్య మ్యాచ్లు జరగవని ఆమె తేల్చి చెప్పారు. పాకిస్థాన్ పదేపదే కాల్పుల ఉల్లంఘన విరమణకు పాల్పడుతోందని, ఇలాంటి పరిస్థితుల్లో క్రికెట్ దౌత్యం సరైంది కాదని ఆమె అభిప్రాయపడ్డారు.
ఉగ్రవాదం, క్రికెట్ ఒకే బాటలో పయనించవని సుష్మ స్పష్టం చేశారు. విదేశాంగ సహాయ మంత్రి ఎంజే అక్బర్, విదేశాంగ కార్యదర్శి ఎస్.జయశంకర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ఖైదీల అప్పగింత జరుగుతుందని ఆమె తెలిపారు.
ఇటీవల కుల్భూషణ్ జాదవ్ కుటుంబంతో పాక్ కనబరిచిన వ్యవహారంతో పాటు కాల్పుల విమరణ ఉల్లంఘనకు పాల్పడిన పాకిస్థాన్తో ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చివరిసారిగా డిసెంబర్ 2012లో పాకిస్థాన్తో భారత్ క్రికెట్ సిరీస్ ఆడింది. అప్పట్లో భారత్లో పాకిస్థాన్ పర్యటించింది.
అయితే ఇరు దేశాల మధ్య పూర్తి స్థాయి క్రికెట్ సిరిస్ మాత్రం 2007లో జరిగింది. అంతేకాదు ఐసీసీ టోర్నీల్లో సైతం పాక్, ఇండియాలను ఒకే గ్రూపులో పెట్టరాదని బీసీసీఐ గతంలో ఐసీసీని కోరింది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.