న్యూఢిల్లీ: టీమిండియా వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ముద్దుల కుమార్తె జీవా ధోనితో బాలీవుడ్ నటుడు సుషాంత్ సింగ్ రాజ్పుత్, ఆయన భార్య అంకిత సరదాగా గడిపారు. ఈ విషయాన్ని సుషాంత్ తన ఫేస్బుక్ ఖాతా ద్వారా తెలుపుతూ.. ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు.

ధోనీ, ఆయన భార్య సాక్షితో కలిసి విందులో పాల్గొన్నట్లు పేర్కొన్నారు. ధోనీ జీవితచరిత్ర ఆధారంగా నీరజ్పాండే దర్శకత్వంలో 'ఎంఎస్ ధోని' అనే హిందీ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రంలో ధోనీ పాత్రలో సుషాంత్ సింగ్ రాజ్పుత్ నటిస్తున్నారు.

కాగా, ఇటీవల ఎంఎస్ ధోనీ.. 'ఎంఎస్ ధోనీ: ది అన్టోల్డ్ స్టోరీ' చిత్ర బృందాన్ని కలిశారు. వారితో ఫొటోలు కూడా దిగారు. బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ ఈ చిత్రంలో ధోనీ తండ్రి పాన్ సింగ్ పాత్రను పోషిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదలకానుంది.