IND vs PAK: ప్రస్తుతం ఆసియా కప్ 2025 ఉత్సాహం మంచి ఊపు మీదుంది. టీమిండియా ఇప్పటివరకు టోర్నమెంట్లో అజేయంగా ఉంది. భారత జట్టు ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. భారత ఆటగాళ్లు మంచి ఫామ్లో ఉన్నారు. గ్రూప్ దశలో పాకిస్తాన్ ను అవమానించిన తర్వాత సూపర్-4లో కూడా భారత్ వారికి మట్టి కరిపించింది. పాకిస్తాన్ అహంకారం పూర్తిగా నాశనమైంది. ఆసియా కప్ 2025 సూపర్-4 మ్యాచ్లో పాక్ జట్టుపై భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. పాకిస్తాన్ భారత్కు 172 పరుగుల లక్ష్యం ఇచ్చింది. టీమిండియా 18.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. భారత్ విజయం సాధించిన అనంతరం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఓ కీలక ప్రకటన చేశాడు.
పాకిస్తాన్ను ఓడించిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ కీలక ప్రకటన
క్రికెట్లో భారత్-పాకిస్తాన్ రైవలరీని అత్యంత గొప్పగా భావిస్తారు. కానీ ఇప్పుడు రెండు దేశాల మధ్య ఎలాంటి రైవలరీ లేదని సూర్య స్పష్టం చేశాడు. దీనికి గల కారణాన్ని కూడా ఆయన వివరించారు.పాకిస్తాన్ను ఓడించిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ.. 'మీరు ఇకపై రైవలరీ గురించి అడగడం ఆపాలి. ఒకవేళ రెండు జట్లు 15-20 మ్యాచ్లు ఆడి, స్కోర్ లైన్ 7-7 లేదా 8-7 అయితే దాన్ని మీరు రైవలరీ అంటారు. కానీ స్కోర్ లైన్ 10-1 లేదా 13-0 అయితే, నాకు కరెక్ట్ స్టాట్స్ తెలియదు, కానీ ఇది ఇకపై రైవలరీ కాదు.' అని సూర్యకుమార్ యాదవ్ పాకిస్తాన్ గాలి తీసినంత పని చేశాడు.

టీమిండియా పాకిస్తాన్ జట్టును గత అన్ని ఫార్మాట్లలో ఆడిన 7 మ్యాచ్లలో ఓడించింది. ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్లో భారత్ కంటే చాలా వెనుకబడిం ఉంది. వారి జట్టు టీమిండియాకు ఏ మాత్రం దగ్గరగా లేదు. ఈ విషయం గణాంకాల ద్వారా రుజువవుతోంది. అయితే పాకిస్తాన్ జట్టుకు పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం మాత్రం బాగా తెలుసు.. కానీ ఆడే సమయానికి వారు తేలిపోతారు. సూపర్ 4లో పాకిస్తాన్ను ఓడించిన తర్వాత టీమిండియా మళ్లీ వారితో కరచాలనం చేయలేదు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్పై ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఆసియా కప్లో భారత్ తదుపరి మ్యాచ్ సెప్టెంబర్ 24న బంగ్లాదేశ్తో జరగనుంది.