దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెత ఒకటుంది. ఇది మన టీమిండియా క్రికెటర్లకు బాగా బోదపడినట్లుంది. మాంచి స్వింగ్లో ఉన్నప్పుడే అన్నీ సమకూర్చుకోవాలనే సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నారు. ఓ వైపు కెరీర్ పీక్ స్టేజ్లో ఉండగానే మరోవైపు ఆర్థికంగా సెటిల్ అవుతున్నారు. భవిష్యత్తును భద్రపరుచుకుంటున్నారు. ప్రస్తుతం టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నాడు. ఇంతకీ సూర్యా భాయ్ ఏం చేశాడు..ప్రత్యేకంగా వార్తల్లో ఎందుకు నిలిచాడో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ముంబైలో మంచి ఇన్వెస్ట్మెంట్ పై కన్నేశాడు. ఆయన ఆలోచనను తన సతీమణి దేవిశా యాదవ్ పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేశారు. ఈ రోజుల్లో ఇల్లు కొనడమంటే మామూలు విషయం కాదు. అది కూడా ముంబైలాంటి మహానగరంలో. కానీ సూర్యాభాయ్ మాత్రం తన ఫ్యూచర్ కోసం మంచి ప్లానింగ్ చేశాడు. కెరీర్ బలంగా ఉండగానే తన ఫైనాన్షియల్ ప్లానింగ్ కూడా మనోడు గట్టిగానే చేశాడు. ముంబై తూర్పు శివారులో 7.18 కోట్లతో విలాసవంతమైన అపార్ట్మెంట్ను కొనుగోలు చేశాడు. CRE మ్యాట్రిక్స్ నివేదిక ప్రకారం గోద్రేజ్ స్కై టెర్రస్ ప్రాజెక్ట్లోని ఈ ఫ్లాట్ రిజిస్ట్రేషన్ 2026 ఫిబ్రవరి 20న జరగ్గా, రూ. 35.90 లక్షల స్టాంప్ డ్యూటీ, 30000 రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లించారు.కేవలం సూర్యాభాయ్ చెల్లించిన స్టాంప్ డ్యూటీతో ఒక మధ్య తరగతి కుటుంబం ఇళ్లు కొనగలదు.


చెంబూర్- డియోనార్లోని గోద్రేజ్ స్కై టెర్రస్స్లో ఉన్న ఈ అపార్ట్మెంట్ సుమారు 140.86 చదరపు మీటర్ల (1,500 చదరపు అడుగులు) విస్తీర్ణంలో ఆధునిక సదుపాయాలతోపాటు రెండు కార్లకు సరిపడా పార్కింగ్ స్పేస్ ఉంది. 360డిగ్రీ షాట్లతో అలరించే సూర్యకుమార్ యాదవ్ ఆర్థిక పరిస్థితి కూడా తన క్రికెట్ కెరీర్ లాగే ఉన్నత స్థాయికి చేరుకుంటోంది. 2026 నాటికి ఆయన మొత్తం ఆస్తి (నికర విలువ) దాదాపు రూ. 55 కోట్లు (7 మిలియన్ డాలర్లు)గా అంచనా. BCCI గ్రేడ్-B కాంట్రాక్ట్ ద్వారా వార్షికంగా పొందే రూ. 3 కోట్లు, IPL నుంచి లభించే రూ. 8 కోట్ల జీతం, యాడ్స్ ప్రధాన ఆదాయ వనరులు.

ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఇదే ప్రాజెక్ట్లో సూర్యకుమార్ యాదవ్ కుటుంబం కొన్న మూడో అపార్ట్మెంట్ ఇది. గత ఏడాది మార్చి 2025లో ఈ దంపతులు 17వ, 18వ అంతస్తుల్లో రెండు పెద్ద యూనిట్లను కొన్నారు.వాటి కార్పెట్ ఏరియా 4,200 చదరపు అడుగులకు పైగా ఉంది.
చెంబూర్ సమీపంలోని డియోనార్లో 1.05 ఎకరాల్లో విస్తరించి ఉన్న గోద్రేజ్ స్కై టెర్రస్స్లో 3 BHK, 4 BHK ఫ్లాట్లు ఉన్నాయి. గతేడాది ఈ ప్రాజెక్ట్లో అనేక లావాదేవీలు నమోదయ్యాయి. మార్చి 2024-ఫిబ్రవరి 2025 మధ్య, దాదాపు ₹202 కోట్ల విలువైన 25 అమ్మకాలు జరిగాయి. సగటు ధర చదరపు అడుగుకు ₹52,000కు పైగా ఉంది.ఈ కొనుగోలు ముంబై ప్రీమియం జోన్లో కుటుంబ పెట్టుబడులను మరింత బలోపేతం చేస్తుంది.