
తమ అభిమాన క్రికెటర్ల గురించి మరింత తెలుసుకోవడానికి అభిమానులు ఎప్పుడూ ఎదురు చూస్తూనే ఉంటారు. ప్రస్తుతం రెడ్ హాట్ ఫామ్లో ఉన్న సూర్యకుమార్ యాదవ్ కూడా ఇప్పుడు ఇదే ఫేజ్లో ఉన్నాడు. అతని గురించి ఏ చిన్న విషయం తెలిసినా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ప్రస్తుత ట20 క్రికెట్లో అత్యుత్తమ బ్యాటర్గా ఉన్న సూర్యకుమార్.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
తనకు విరాట్ కోహ్లీతో బ్యాటింగ్ చెయ్యడం అంటే చాలా ఇష్టమని సూర్యకుమార్ చెప్పాడు. వీళ్లిద్దరూ టీ20 వరల్డ్ కప్లో కూడా టీమిండియాకు అద్భుతమైన విజయాలు అందించారు. భారత్ తరఫున టోర్నీ టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఈ క్రమంలోనే విరాట్తో బ్యాటింగ్ చేయడం గురించి పెదవి విప్పాడు. కోహ్లీతో కలిసి బ్యాటింగ్ చేయడాన్ని చాలా ఎంజాయ్ చేస్తానన్న సూర్య.. 'తనతో కలిసి ఆడుతున్నప్పుడు చాలా ఎక్కువగా పరిగెత్తాల్సి వస్తుంది. తను చాలా ఫిట్గా ఉంటాడు కదా' అన్నాడు.

ఈ క్రమంలోనే అతనికి ఒక ప్రశ్న ఎదురైంది. టీమిండియాలో మంచి ఫిట్గా ఉండే ఆటగాళ్లలో కోహ్లీ, హార్దిక్ ఇద్దరూ ముందుంటారు. ఇదే విషయాన్ని ఎత్తి చూపుతూ.. 'కోహ్లీ, హార్దిక్, మీరు.. ముగ్గురూ కలిసి వంద మీటర్ల పరుగుపందెంలో పాల్గొంటే ఎవరు గెలుస్తారు?' అని సూర్యకుమార్ను అడిగారు. ఈ ప్రశ్న విన్న అతను క్షణం కూడా ఆలోచించకుండా 'విరాట్ కోహ్లీ' అని సమాధానం చెప్పాడు. కోహ్లీ ఫిట్నెస్ చాలా అద్భుతంగా ఉంటుందని కితాబిచ్చాడు.
అలాగే భవిష్యత్తులో సూర్యకుమార్ జీవితంపై సినిమా తీస్తే ఎవరు యాక్ట్ చేయాలని అనుకుంటున్నారు? అని అడగ్గా.. 'నా మీద సినిమా వస్తే ఆ పాత్రలో శ్రేయస్ తాల్పడే యాక్ట్ చేయాలని కోరుకుంటా' అని చెప్పాడు. ఈ మరాఠీ యాక్టర్ తన కెరీర్లో కొన్ని మంచి క్రికెట్ సంబంధిత చిత్రాల్లో నటించాడు. ఈ ఏడాది వచ్చిన 'కౌన్ ప్రవీణ్ తంబే' చిత్రంలో కూడా శ్రేయస్ నటనకు మంచి మార్కులు పడ్డాయి.