
ఐపీఎల్ 2022 సీజన్లో ముంబై.. రాజస్థాన్ రాయల్స్తో శనివారం జరిగిన మ్యాచ్లో గెలుపొంది తన తొలి విజయాన్ని నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ (39 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 51) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. తిలక్ వర్మ(30 బంతుల్లో ఫోర్, 2 సిక్స్లతో 35), టీమ్ డేవిడ్(20 నాటౌట్) రాణించడంతో రాజస్థాన్ రాయల్స్ విధించిన 159పరుగుల లక్ష్యాన్ని ముంబై మరో మూడు బంతులు ఉండగానే ఛేదించింది.
ఈ మ్యాచ్లో భాగంగా సూర్యకుమార్ యాదవ్ 27పరుగుల వద్ద ఉన్నప్పుడు చాహల్ 8వ ఓవర్ బౌలింగ్ వేశాడు. ఆ ఓవర్ చివరి బంతికి తన మార్క్ బౌలింగ్తో సూర్యను ఎల్బీడబ్ల్యూ చేశాడు. అప్పీలు చేసినప్పటికీ అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. అయితే చాహల్ చాలా నమ్మకంగా రివ్యూ తీసుకోవాలని కెప్టెన్ సంజూ శాంసన్కు సూచించాడు. రివ్యూలో సూర్య స్వీప్ షాట్ ఆడుతుండగా బ్యాట్కు ఏమాత్రం తాకకుండా బాల్ ప్యాడ్లను తాకినట్లు ఉంది. దీంతో అంపైర్ బాల్ ట్రాకింగ్కు వెళ్లాడు. బాల్ ట్రాకింగ్లో మాత్రం బాల్ ఇన్ లైన్ పడి వికెట్లను గిరటేస్తున్నట్లు చూపించినప్పటికీ అంపైర్ కాల్ అని పడింది. దాని ప్రకారం.. అంపైర్ నాటౌట్ ఇచ్చాడు కాబట్టి నాటౌట్ అని తేలింది. దీంతో చాహల్ తీవ్ర నిరాశ చెందాడు. ఇక సూర్య కుమార్ యాదవ్.. అవతలి ఎండ్లో ఉన్న చాహల్ మెడ మీద చేయి వేసి హగ్ చేసుకుని ఓదార్చాడు.
ఈ విషయమై మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న అనంతరం సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. చాహల్ బౌలింగ్లో జరిగిన ఈ చిన్నపాటి ఓదార్పు విషయాన్ని ప్రస్తావించాడు. ' నేను చాహల్ను జస్ట్ కౌగిలించుకుని ఓదార్చాను అంతే.. ఆ సమయంలో అతనికి ఏం చెప్పలేదు. మా ఇద్దరి మధ్య సరదా విషయమే కానీ సీరియస్ ఏం జరగలేదు. ఇక అంపైర్ కాల్ వల్ల నేను తప్పించుకున్నా. ఆ తర్వాత నేను, తిలక్ కలిసి ఇన్నింగ్స్ నిర్మించడం, చివర్లో మా ప్లేయర్లు రాణించడం వల్ల గెలుపొందడం సంతోషంగా అనిపించింది. ఇక చాహల్ విషయానికొస్తే అతనో గొప్ప బౌలర్. అతని బౌలింగ్లో ఆడడాన్ని నేను ఆస్వాదిస్తాను' అని సూర్యకుమార్ తెలిపాడు. ఇక సూర్యకుమార్ 51పరుగుల వద్ద చాహల్ బౌలింగ్లోనే రియాన్ పరాగ్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఈ క్రమంలో తిలక్ వర్మతో కలిసి 81పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.