జట్టులో చేరినప్పటి నుంచే..
దేశవాళీలు, ఐపీఎల్లో ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్సులు ఆడి తాను ఆడుతున్న జట్టుకు మరపురాని విజయాలు అందించాడు సూర్యకుమార్ యాదవ్. భారత్ తరఫున కూడా అద్భుతమైన ఆటతీరు కనబరిచాడు. ఈ ప్రపంచకప్లో భారత్ ఓడినా కూడా జట్టు మొత్తంలో రాణించిన బ్యాటర్లలో సూర్య కూడా ఒకడు. అయితే అతను కేవలం బ్యాటరే కాదని, మంచి నాయకుడూ కూడా అని అంటున్నాడు వినాయక్ మానే. సూర్యతో కలిసి క్లబ్ క్రికెట్ ఆడిన అతను పలు ఆసక్తికర విషయాలు చెప్పాడు.
మంచి క్రికెటింగ్ బ్రెయిన్
సూర్యకు మంచి క్రికెటింగ్ బ్రెయిన్ ఉందన్న మానే.. అతను అద్భుతమైన వ్యూహాలు వేస్తాడని మెచ్చుకున్నాడు. 'నన్నడిగితే జట్టుకు కెప్టెన్ అవడానికి సూర్య సిద్దంగా ఉన్నాడు. అతనికి కొత్తగా ఏమీ నేర్పించాల్సిన అవసరం లేదు. నేను సెలెక్టర్ను కాదు కానీ.. సూర్యను చాలా దగ్గర నుంచి చూశా. అతను మైదానంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోగలడో నాకు తెలుసు. కెప్టెన్ రేసులో అతను బలమైన అభ్యర్థి అని నా నమ్మకం' అని చెప్పాడు.
అనుభవం కూడా ఉంది..
అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ ఆడుతూ కూడా ఖాళీ దొరికినప్పుడల్లా వినాయక్ మానేతో కలిసి క్లబ్ క్రికెట్ ఆడటం సూర్య మర్చిపోలేదు. దేశవాళీల్లో కూడా ఆడుతూనే ఉన్నాడు. ఈ స్టేజ్లో కెప్టెన్గా చేసిన అనుభవం కూడా సూర్యకు ఉంది. 2014-15 రంజీ ట్రోఫీలో ముంబై జట్టుకు నాయకత్వం వహించిన సూర్య.. బ్యాటింగ్పై ఫోకస్ పెట్టాలని చెప్పి సీజన్ మధ్యలోనే తన బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. అయితే అతనిపై నమ్మకం ఉంచిన మేనేజ్మెంట్ 2019-20 సీజన్లో మళ్లీ అతనికే జట్టు పగ్గాలు అందించింది. 2021-2022 సీజన్లో కూడా సూర్యనే ముంబై జట్టుకు సారధ్య బాధ్యతలు నిర్వర్తించాడు.