
అహ్మదాబాద్: టీమిండియా కోసం తాను ఏ స్థానంలోనైనా ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని యువ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ వెల్లడించాడు. ఐదో స్థానంలో బ్యాటింగ్ చేయడం తనకు కొత్తేమి కాదని తెలిపాడు. కాగా వెస్టిండీస్తో అహ్మదాబాద్ వేదికగా జరిగిన తొలి వన్డే మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ ఐదో స్థానంలోనే బ్యాటింగ్ చేశాడు. అవసరమైతే బౌలింగ్ కూడా చేస్తానని చెప్పుకొచ్చాడు. ప్రతిరోజూ బ్యాటింగ్తోపాటు బౌలింగ్ కూడా ప్రాక్టీస్ చేస్తానని తెలిపాడు. జట్టు అవసరాలను బట్టి అవకాశం ఇస్తే కచ్చితంగా బౌలింగ్ చేస్తానని చెప్పాడు. వెస్టిండీస్తో తొలి వన్డేలో వికెట్ కాపాడుకుంటూ తాను నిలకడగా ఆడిన విషయాన్ని గుర్తు చేసిన సూర్యకుమార్ యాదవ్.. రెండో వన్డేలోనూ అదే ఆట తీరును కొనసాగిస్తానని చెప్పాడు. క్రీజులో కుదురుకుని స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయగలిగితే పరుగులు వాటంతట అవే వస్తాయని అన్నాడు. ప్రస్తుతం ఐదో స్థానంలో ఆడుతున్నానని, ఓపెనర్గా దిగిన ఇలాగే ఆడుతానని సూర్య కుమార్ చెప్పాడు.
ఇక రెండో వన్డేలో కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ అందుబాటులో ఉండడం పట్ల సూర్యకుమార్ యాదవ్ సంతృప్తి వ్యక్తం చేశాడు. వారి రాకతో జట్టు మరింత బలోపేతం అవుతుందని చెప్పుకొచ్చాడు. అయితే రెండో వన్డేలో తుది జట్టులో ఎవరికి అవకాశం ఇవ్వాలి? ఎవరిని బెంచ్కే పరిమితం చేయాలనే అంశాలను జట్టు మేనేజ్మెంట్ చూసుకుంటుందని చెప్పాడు. ఇక తనను సూర్యకుమార్ లాగే ఉండనివ్వాలని, వేరే వాళ్లతో పోల్చొద్దని, జట్టులో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నానని కోరాడు. కాగా ఇప్పటికే భారత జట్టుకు పలు మ్యాచ్ల్లో ప్రాతినిధ్యం వహించిన సూర్యకుమార్ యాదవ్ 3, 4, 5, 6వ స్థానాల్లో బ్యాటింగ్ చేశాడు.
భారత్, వెస్టిండీస్ మధ్య బుధవారం రెండో వన్డే మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే తొలి వన్డేలో గెలిచి ఊపు మీదున్న రోహిత్ సేన ఈ మ్యాచ్ను కూడా గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. మరోవైపు వెస్టిండీస్ మాత్రం రెండ్ మ్యాచ్లో గెలిచి సిరీస్ రేసులో నిలవాలని ఆశిస్తుంది.
టీమిండియా తుది జట్టు (అంచనా)
రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, ప్రసిధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్.