
భారత బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ తన మార్క్ బ్యాటింగ్తో ఐసీసీ టీ20ఐ బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో హవా చూపాడు. రెండో ర్యాంకుకు చేరుకున్నాడు. అలాగే దక్షిణాఫ్రికా స్పిన్నర్ తబ్రైజ్ షమ్సీ సైతం బౌలింగ్ ర్యాంకింగ్స్లో రెండో స్థానానికి చేరుకున్నాడు. ఐసీసీ ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్లో సూర్య కుమార్ యాదవ్ అత్యుత్తమ రేటింగ్ పాయింట్లతో అదరగొట్టాడు. ప్రస్తుతం నంబర్ 1 ర్యాంకులో ఉన్న బాబర్ ఆజామ్కు డేంజర్ బెల్స్ మోగించాడు. నిన్న వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో (44బంతుల్లో 76 పరుగులు)తో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుతో సూర్య చెలరేగి ఇండియాను గెలిపించిన సంగతి తెలిసిందే.
ఈ మ్యాచ్ అనంతరం సూర్యకుమార్ యాదవ్ మూడు స్థానాలు ఎగబాకి రెండో స్థానానికి చేరుకున్నాడు. ఇక ప్రస్తుతం బాబర్ ఆజామ్ (818)పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. సూర్య కేవలం రెండు రేటింగ్ పాయింట్లు (816)పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ సిరీస్ అయిపోయే లోపు సూర్య ఒక్క గట్టి ఇన్నింగ్స్ ఆడితే నంబర్ 1 ర్యాంకుకు చేరుకునే వీలుంది. ప్రస్తుతం వెస్టిండీస్తో జరుగుతున్న టీ20 సిరీస్లో భారత్ 2-1 ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే. ఇకపోతే బౌలింగ్లో తబ్రైజ్ షమ్సీ రెండో స్థానానికి చేరుకోగా.. హజిల్ వుడ్ తన అగ్రస్థానంలో పదిలంగా ఉన్నాడు.
ఇటీవల ఇంగ్లాండ్తో జరిగిన మూడు మ్యాచ్ల్లోనూ హాఫ్ సెంచరీలు చేసిన దక్షిణాఫ్రికా బ్యాటర్ రీజా హెండ్రిక్స్ 16 స్థానాలు ఎగబాకి 15వ ర్యాంక్కు చేరుకున్నాడు. వెస్టిండీస్ బ్యాటర్ బ్రాండన్ కింగ్ 29 స్థానాలు ఎగబాకి 27వ ర్యాంక్కు, ఇంగ్లాండ్ బ్యాటర్ జానీ బెయిర్స్టో 13 స్థానాలు ఎగబాకి 31వ ర్యాంక్కు చేరుకున్నారు.
అలాగే వెస్టిండీస్ స్పిన్నర్ అకేల్ హోసేన్ మూడు స్థానాలు ఎగబాకి ఆరో ర్యాంక్కు, ఇంగ్లాండ్ బౌలర్ క్రిస్ జోర్డాన్ ఒక స్థానం ఎగబాకి 16వ ర్యాంక్కు, న్యూజిలాండ్ స్పిన్నర్లు మిచెల్ సాంట్నర్ మూడు స్థానాలు ఎగబాకి 17వ ర్యాంక్కు చేరుకున్నాడు. ఇక భారత ప్లేయర్లలో ఇషాన్ కిషన్ 14, రోహిత్ శర్మ 16, రాహుల్ 20, శ్రేయస్ అయ్యార్ 25, విరాట్ కోహ్లీ 28వ స్థానాల్లో కొనసాగుతున్నారు. బౌలర్లలో టాప్ 10లో భువనేశ్వర్ కుమార్ 8వ స్థానంలో ఉండగా.. ఆల్రౌండర్లలో ఒక్కరు లేరు.