
టీమిండియా యువ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ చెలరేగాడు. బౌండరీలతో మైదానాన్ని హోరెత్తించాడు. దొరికిన బంతిని దొరికినట్టుగా బౌండరీ లైన్ దాటించాడు. బౌలర్ బంతి ఏస్తే అది బౌండరీనే అన్నట్టుగా సాగింది అతని విధ్వంసం. టెస్టు మ్యాచ్లో సైతం టీట్వంటీ తరహాలో బ్యాటింగ్ చేశాడు. మొత్తంగా 37 ఫోర్లు, 5 సిక్స్లతో 152 బంతుల్లోనే 249 పరుగులు బాదేశాడు. సూర్యకుమార్ విధ్వంసంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి అతని జట్టు 9 వికెట్ల నష్టానికి 524 పరుగుల భారీ స్కోర్ చేసి పటిష్ట స్థితిలో నిలిచింది.
ముంబైలో జరిగిన 74వ పోలీస్ ఇన్విటేషన్ షీల్డ్ ఫైనల్లో భాగంగా పార్సీ జింఖానా, పయ్యాడే ఎస్స్సీ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో 31 ఏళ్ల సూర్యకుమార్ యాదవ్ పార్సీ జింఖానా తరఫున బరిలోకి దిగాడు. రాయిస్టన్ డియాజ్, పర్దీప్ సఫ్, డోల్మిల్ మట్కర్, దీపక్ శెట్టి, అతిఫ్ అటల్వారా వంటి ఆటగాళ్ల బౌలింగ్ దాడిని ఎదుర్కొని ఈ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. లంచ్ బ్రేక్ సమయానికి ముందే సెంచరీ చేసిన సూర్య.. ఆ తర్వాత మరింత రెచ్చిపోయాడు. టెస్ట్ మ్యాచ్లో సైతం టీ20 తరహాలో బ్యాటింగ్ చేసి అదరగొట్టాడు. బౌండరీల ద్వారానే 178 పరుగులు చేశాడంటే సూర్య ఏ రేంజ్లో విరుచుకుపడ్డాడో అర్థం చేసుకోవచ్చు. లంచ్ తర్వాతి నుంచి వేగంగా ఆడాలని నిశ్చయించుకున్నానని, అలాగే ఆడానని సూర్య చెప్పాడు. గ్రౌండ్ చిన్నది కావడంతో సులభంగా బ్యాటింగ్ చేయగలిగానని చెప్పాడు. బౌండరీలను సునాయసంగా బాద గలిగానని తెలిపాడు. ఇక తన సహచరులు ప్రశంసిచినప్పుడు తాను డబుల్ సెంచరీ పూర్తి చేసినట్టు తెలిసిందని వెల్లడించాడు. మొదటి రోజు వీలైనన్నీ ఎక్కువ పరుగులు చేయాలనే లక్ష్యంతో బ్యాటింగ్ చేసినట్టు సూర్య వెల్లడించాడు.
కాగా సూర్యకుమార్ విజయ్ హజారే ట్రోఫీలో విఫలమయ్యాడు. 14, 4, 49, 8 పరుగులను మాత్రమే సాధించాడు. అతని జట్టు ముంబై కూడా ట్రోఫీలో లీగ్ స్టేజ్లోనే నిష్క్రమించింది. ఇక న్యూజిలాండ్తో జరిగిన టీ20 సిరీస్లోనూ మెదటి మ్యాచ్లో రాణించినప్పటికీ.. తర్వాతి రెండు మ్యాచ్ల్లో విఫలమయ్యాడు. దీంతో సరైన ఫామ్లో లేక ఇబ్బంది పడుతున్నాడు. అయితే తాజా ఇన్నింగ్స్తో సూర్యకుమార్ యాదవ్ గాడిలో పడ్డట్టైంది. కాగా దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా జరిగే వన్డే సిరీస్లో సూర్య కుమార్ యాదవ్ ఆడనున్నాడు. దీంతో అతనికి ఈ డబుల్ సెంచరీ మంచి బూస్టాఫ్ ఇచ్చినట్టయింది.