IND vs AUS: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య టీ20 సిరీస్ ప్రారంభమైంది. తొలి మ్యాచ్లోనే భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఓ అద్భుతమైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ అంతర్జాతీయ టీ20 క్రికెట్లో 150 సిక్సర్ల మైలురాయిని అధిగమించాడు. ఈ ఘనత సాధించిన భారత ఆటగాళ్లలో రోహిత్ శర్మ తర్వాత స్థానం సూర్య కుమార్ యాదవ్దే కావడం విశేషం. కాన్ బెర్రాలోని మనుకా ఓవల్లో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో సూర్యకుమార్ ఈ రికార్డును సాధించాడు. ఈ మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ తన రెండో సిక్స్ను కొట్టగానే 150 సిక్సర్ల ప్రత్యేక క్లబ్లో చేరాడు.
ప్రపంచంలో ఐదో బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్
సూర్యకుమార్ యాదవ్ ప్రపంచవ్యాప్తంగా ఈ అరుదైన మైలురాయిని చేరుకున్న ఐదో బ్యాటర్గా నిలిచాడు. అంతేకాక ఈ జాబితాలో చేరిన అత్యంత వేగవంతమైన బ్యాటర్లలో సూర్య ఒకడు. ప్రస్తుతం అంతర్జాతీయ టీ20లలో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డు ఇప్పటికీ రోహిత్ శర్మ పేరు మీదే ఉంది. రోహిత్ శర్మ 205 సిక్సర్లు కొట్టాడు. సూర్యకుమార్తో పాటు ఈ క్లబ్లో ఉన్న ఇతర ప్రముఖ బ్యాటర్లు వీరే..
*రోహిత్ శర్మ(భారత్) -205 సిక్సులు
*మహ్మద్ వసీం(యూఏఈ)-183 సిక్సులు
*మార్టిన్ గప్టిల్(న్యూజిలాండ్)-173 సిక్సులు
*జోస్ బట్లర్ (ఇంగ్లాండ్) -172
*సూర్యకుమార్ యాదవ్(భారత్ 150+

భారత్ తరఫున రోహిత్, సూర్యకుమార్ తర్వాత విరాట్ కోహ్లీ (124 సిక్సర్లు) మాత్రమే 100 కంటే ఎక్కువ టీ20I సిక్సర్లు కొట్టిన ఆటగాడు.
సూర్యకుమార్ యాదవ్ టీ20I కెరీర్
సూర్యకుమార్ యాదవ్ అంతర్జాతీయ టీ20 కెరీర్ చాలా అద్భుతంగా ఉంది. తన 91వ అంతర్జాతీయ టీ20 మ్యాచ్ (86 ఇన్నింగ్స్) వరకు 2,650 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. అతని సగటు 37 కంటే ఎక్కువ ఉండగా.. విధ్వంసక స్ట్రైక్ రేట్ 165 కంటే ఎక్కువగా ఉంది. ఈ సమయంలో సూర్యకుమార్ యాదవ్ 21 అర్ధ సెంచరీలు, 4 సెంచరీలు కూడా సాధించాడు. ఇంకో ప్రత్యేక రికార్డు ఏమిటంటే.. నాలుగు వేర్వేరు దేశాలలో (దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, భారతదేశం) టీ20I సెంచరీలు సాధించిన ఏకైక ఆటగాడు కూడా సూర్యకుమార్ యాదవే కావడం గమనార్హం.