
అడిలైడ్: టీ20 ప్రపంచకప్ 2022 టోర్నమెంట్ సూపర్ 12 ముగింపు రోజు మరో సంచలనం చోటు చేసుకుంది. సెమీ ఫైనల్స్ బెర్త్ దాదాపుగా కన్ఫర్మ్ చేసుకున్న దక్షిణాఫ్రికా జట్టు టోర్నమెంట్ నుంచి వైదొలగించింది. సెమీ ఫైనల్స్ చేరే అవకాశాలను చేజేతులారా పోగొట్టుకుంది. సూపర్ 12 దశలోనే ఆ జట్టు ప్రస్థానం ముగిసింది. తన చివరి మ్యాచ్లో నెదర్లాండ్స్ చేతిలో మట్టి కరిచింది దక్షిణాఫ్రికా. అత్యంత అవమానకరంగా టోర్నమెంట్ నుంచి అవుట్ అయింది.
దీని తరువాత సెమీ ఫైనల్స్ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. దక్షిణాఫ్రికా స్థానంలో పాకిస్తాన్ సెమీ ఫైనల్స్కు చేరనున్నాయి. ప్రస్తుతం ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ కొనసాగుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లల్లో ఎనిమిది వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. 128 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన పాకిస్తాన్ ధాటిగా ఆడుతోంది. 10 ఓవర్లల్లో వికెట్ నష్టపోకుండా 56 పరుగులు చేసింది. మహ్మద్ రిజ్వాన్ - 31, బాబర్ ఆజమ్ - 25 పరుగులతో ఆడుతున్నారు.
ఇంగ్లాండ్, న్యూజిలాండ్ ఇదివరకే సెమీ ఫైనల్స్ చేరుకున్నాయి. దక్షిణాఫ్రికా ఓడిపోవడంతో భారత్ సెమీస్ బెర్త్ కూడా కన్ఫర్మ్ అయింది. జింబాబ్వేతో మ్యాచ్ మిగిలివుండగానే- సెమీ ఫైనల్స్లో అడుగుపెట్టింది రోహిత్ సేన. ఇక్కడ భారత్-ఇంగ్లాండ్ తలపడనున్నాయి. పాకిస్తాన్-బంగ్లాదేశ్ మ్యాచ్లో గెలిచిన జట్టు న్యూజిలాండ్ను ఎదుర్కొంటుంది. ఈ అవకాశం పాకిస్తాన్కే దక్కడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
సెమీస్లో భారత్ను తలపడాల్సి ఉన్న నేపథ్యంలో ఇంగ్లాండ్ జట్టు కేప్టెన్ జోస్ బట్లర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాను ఎదుర్కొనడానికి ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్నామని పేర్కొన్నాడు. ఆ జట్టును ఓడించడానికి తమవద్ద అవసరమైన ప్రణాళికలు ఉన్నాయని వ్యాఖ్యానించాడు. బ్యాటింగ్, బౌలింగ్లో భారత్ బలంగా ఉందని, అలాంటి జట్టుపై గెలవాలంటే శ్రమించక తప్పదనీ అభిప్రాయపడ్డాడు.
టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు జోస్ బట్లర్. అతణ్ని అవుట్ చేయడానికి ప్రత్యేకంగా అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకున్నామని పేర్కొన్నాడు. సూర్యకుమార్ను అత్యంత ప్రమాదకర బ్యాటర్గా అభివర్ణించాడు. ఒంటి చేత్తో జట్టును గెలిపించగల శక్తి సామర్థ్యాలు అతనికి ఉన్నాయని అన్నాడు. అతనిపై తమ బౌలర్లు ప్రత్యేకంగా దృష్టి సారించారని, బలహీనతలపై నిఘా ఉంచామని చెప్పాడు.