టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ టీ20ల్లో విధ్వంసకర ఇన్నింగ్స్లు ఆడతాడని, కానీ వన్డే ఫార్మాట్లో సత్తాచాటలేకపోతున్నాడని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాజర్ హుస్సేన్ అన్నాడు. అయితే వన్డేల్లో తాను విఫలమవుతున్నాడంటూ విమర్శలు ఎదుర్కోవడం సూర్యకుమార్కు ఇది కొత్తేమి కాదు. ప్రపంచకప్ అనంతరం జరిగిన ఆస్ట్రేలియా టీ20 సిరీస్లో ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ మాథ్యూ హేడెన్ సూర్యను దారుణంగా ట్రోల్ చేశాడు.
సూర్యకుమార్ను ఆసీస్ ఎలా ఎదుర్కొంటుందని రవిశాస్త్రి ప్రశ్నించగా.. 'ఇది టీ20 కాదు, వన్డే అని సూర్యకు చెబుతాం' అని హెడెన్ వ్యంగ్యంగా బదులిచ్చాడు. దానికి తగ్గట్టుగానే టీ20 నంబర్ వన్ బ్యాటర్ సూర్య రికార్డులు వన్డేల్లో పేలవంగా ఉన్నాయి. ప్రపంచకప్ ఫైనల్లో సూర్య విఫలమైన అనంతరం నెట్టింట్లో ట్రోల్స్కు గురయ్యాడు. టీ20ల్లో మాత్రమే సూర్య పులి అని, వన్డేల్లో పిల్లిని పెద్దఎత్తున విమర్శలు ఎదుర్కొన్నాడు.

''ప్రస్తుత టీ20 క్రికెట్లో సూర్యకుమార్ ఆటను చూడటం అద్భుతంగా ఉంటుంది. మిస్టర్ 360గా గొప్పగా సత్తాచాటుతున్నాడు. కానీ వన్డేల్లో తేలిపోతున్నాడు. ఏ సమయానికి ఎలా ఆడాలో, ఎలా స్పందించాలో తెలియని పరిస్థితిలో ఉన్నాడు. కానీ టీ20 క్రికెట్లో మాత్రం ఏ క్షణంలో ఎలా ఆడాలో అతడికి స్పష్టత ఉంటుంది. పొట్టి ఫార్మాట్లో అతడి ఆడటం చాలా సరదాగా ఉంటుంది'' అని నాజర్ హుస్సేన్ అన్నాడు.
ఈ ఏడాది జూన్లో జరగనున్న టీ20 ప్రపంచకప్లో దక్షిణాఫ్రికా విజేతగా నిలుస్తుందని నాజర్ హుస్సేన్ జోస్యం చెప్పాడు. ''ఇంగ్లాండ్ ఛాంపియన్ జట్టు. కానీ ప్రస్తుతం ఫామ్లో లేదు. అయితే ప్రపంచకప్ కరేబియన్ దీవుల్లో జరగనుంది. అక్కడ వెస్టిండీస్, పాకిస్థాన్ పోటీ ఇచ్చే అవకాశం ఉంది. కానీ ఫైనల్లో ఇంగ్లాండ్-దక్షిణాఫ్రికా తలపడతాయని భావిస్తున్నా. విజేతగా సౌతాఫ్రికా నిలుస్తుంది అని అనుకుంటున్నా. ఇటీవల జరిగిన వన్డే ప్రపంచకప్లో దక్షిణాఫ్రికా గొప్పగా సత్తాచాటింది'' అని పేర్కొన్నాడు.
గతేడాది ప్రారంభించిన సౌతాఫ్రికా టీ20 లీగ్తో దక్షిణాఫ్రికా జట్టు బలోపేతంగా మారిందని నాజర్ హుస్సేన్ అభిప్రాయపడ్డాడు. టీ20 ప్రపంచకప్లో ఆ లీగ్ అనుభవం సఫారీ జట్టుకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పాడు. కాగా, జూన్లో జరగనున్న టీ20 వరల్డ్ కప్నకు అమెరికా-వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి.