Suryakumar Yadav: టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పాకిస్తాన్ జట్టుపై ఆసియా కప్ 2025 విజయం తర్వాత తన గొప్ప మనసును చాటుకున్నారు. టోర్నమెంట్ నుంచి తాను అందుకున్న మొత్తం మ్యాచ్ ఫీజును దేశ సైన్యానికి(ఆర్మీకి), పహల్గాం ఉగ్రదాడిలో బాధితులైన కుటుంబాలకు దానం చేయనున్నట్లు ప్రకటించారు. ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్ జట్టుపై అద్భుతమైన విజయం సాధించిన అనంతరం ఈ ప్రకటన చేశారు.
ఆదివారం రాత్రి దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో టీమిండియా పాకిస్తాన్ను 5 వికెట్ల తేడాతో ఓడించి టైటిల్ను కైవసం చేసుకుంది. విజయం తర్వాత సూర్యకుమార్ యాదవ్ ఎక్స్(గతంలో ట్విట్టర్) వేదికగా ఓ భావోద్వేగ పోస్ట్ షేర్ చేశారు.సూర్యకుమార్ యాదవ్ ఇలా రాసుకొచ్చారు. "ఈ టోర్నమెంట్ నుంచి నా మ్యాచ్ ఫీజును మన సాయుధ దళాలకు మద్దతు ఇవ్వడానికి, పహల్గాం ఉగ్రవాద దాడిలో బాధితులైన కుటుంబాలకు సహాయం చేయడానికి దానం చేయాలని నిర్ణయించుకున్నాను. మీరు ఎల్లప్పుడూ నా ఆలోచనలలో ఉంటారు. జై హింద్." అని అన్నారు. ఈ పోస్ట్ వెంటనే వైరల్ గా మారింది. కెప్టెన్ సూర్య ఉదారతను ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ప్రశంసించారు. దేశ జవాన్ల పట్ల, అమాయక ప్రజల పట్ల తన గౌరవాన్ని వ్యక్తపరచడానికి ఇది మార్గమని సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు.

అభిమానుల అంచనా ప్రకారం.. సూర్యకుమార్ యాదవ్ సుమారు రూ.18 లక్షల మొత్తాన్ని సైన్యానికి, బాధిత కుటుంబాలకు దానం చేయనున్నారు. ఓ నెటిజన్ సూర్యకుమార్ను ప్రశంసిస్తూ, "ముందు ఉగ్రవాదులతో కరచాలనం చేయడానికి నిరాకరించారు. ఆపై విజయాన్ని పహల్గాం బాధితులకు అంకితం చేశారు. ఈ టోర్నమెంట్లో పాకిస్తాన్ను మూడుసార్లు మట్టి కరిపించారు. ఇప్పుడు తన మ్యాచ్ ఫీజును సైన్యానికి దానం చేశారు. అద్భుతం సూర్య కుమార్ యాదవ్." అని కామెంట్ చేశారు.
బీసీసీఐ విజేత భారత జట్టుకు మరియు సహాయక సిబ్బందికి రూ.21 కోట్ల ప్రైజ్ మనీ ప్రకటించింది. అయితే, విజేత జట్టుకు ట్రోఫీని అందించే సంప్రదాయ వేడుక జరగకపోవడంతో విజయోత్సవం కొంచెం వెలితిగా మారింది.దీనిపై సూర్యకుమార్ యాదవ్ వ్యాఖ్యానిస్తూ, "విజేత జట్టుకు ట్రోఫీని ఇవ్వకపోవడం నేను ఎప్పుడూ చూడలేదు," అని అన్నారు. ఆట ముగిసినప్పుడు, కేవలం చాంపియన్స్ను మాత్రమే గుర్తుంచుకుంటారని, ట్రోఫీ చిత్రాన్ని కాదని ఆయన అన్నారు. "నాకు, నా ఆటగాళ్లు, సహాయక సిబ్బందియే నిజమైన ట్రోఫీ," అని ఆయన పేర్కొన్నారు.