టీమిండియా స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ చరిత్ర సృష్టించాడు. టీ20 ఫార్మాట్లో ఐసీసీ ఉత్తమ క్రికెటర్ అవార్డును వరుసగా రెండోసారి అందుకున్నాడు. 2023లో పరుగుల వరద పారించిన సూర్యను టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా ఐసీసీ ప్రకటించింది. ఈ క్రమంలో సూర్యకుమార్ అరుదైన రికార్డు సాధించాడు. టీ20 ఫార్మాట్లో ఈ అవార్డును రెండు సార్లు అందుకున్న ఏకైక క్రికెటర్గా నిలిచాడు.
టీ20ల్లో ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్ అయిన సూర్యకుమార్ 2022లోనూ ఉత్తమ క్రికెటర్గా ఎంపికైన విషయం తెలిసిందే. ఈ అవార్డును ఐసీసీ 2021 నుంచి బహుకరిస్తుంది. 2021లో పాకిస్థాన్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ అందుకున్నాడు. కాగా, ఈ 'మెన్స్ టీ20 క్రికెట్ ఆఫ్ ది ఇయర్' అవార్డు కోసం 2023 ఏడాదికి గానూ నలుగురు ప్లేయర్లను ఐసీసీ తొలుత షార్ట్ లిస్ట్ చేసింది. సూర్య కుమార్తో పాటు సికందర్ రజా (జింబాబ్వే), అల్పేష్ రమ్జాని (ఉగాండా), మార్క్ చాప్మన్ (న్యూజిలాండ్) అవార్డు కోసం పోటీపడ్డారు.

2023లో సూర్యకుమార్ 17 ఇన్నింగ్స్లో 48 సగటుతో, 155 స్ట్రైక్ రేటుతో 733 పరుగులు చేశాడు. దీనిలో రెండు సెంచరీలు ఉన్నాయి. జింబాబ్వే ఆల్రౌండర్ సికందర్ రజా కూడా సత్తాచాటాడు. 11 ఇన్నింగ్స్ల్లో 515 పరుగులతో పాటు 17 వికెట్లు తీశాడు. ఉగాండా బౌలర్ అల్పేష్ గతేడాది 55 వికెట్లు తీశాడు. అలాగే కివీస్ బ్యాటర్ మార్క్ చాప్మన్ 19 ఇన్నింగ్స్ల్లో 576 పరుగులు సాధించాడు. మొత్తంగా వీళ్లందరిలో సూర్యనే ఐసీసీ మరోసారి మెచ్చింది.
కాగా, దక్షిణాఫ్రికా సిరీస్లో గాయపడిన సూర్యకుమార్ టీమిండియాకు దూరమైన సంగతి తెలిసిందే. అయితే ఆ గాయం నుంచి కోలుకుంటున్న సూర్య మరో సమస్యతో బాధ్యపడుతున్నట్లు గుర్తించాడు. హెర్నియా సమస్య ఉందని తెలియడంతో ఇటీవల జర్మనీలో శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. ప్రస్తుతం సూర్య కోలుకుంటున్నాడు. అతడు పూర్తిగా కోలుకోవడానికి కనీసం మరో రెండు నెలల సమయం పడుతుంది. ఐపీఎల్ ప్రారంభ సమయానికి అతడు పూర్తి ఫిట్నెస్ సాధించలేకపోవచ్చు. కానీ టీ20 ప్రపంచకప్ సమయానికి అందుబాటులో ఉంటాడు.