
టీ20 క్రికెట్లో బెస్ట్ బ్యాటర్గా కొనసాగుతున్న టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ మరో కీలక రికార్డుకు అడుగు దూరంలో నిలిచాడు. ఇటీవల భారత్, న్యూజిల్యాండ్ మధ్య జరిగిన రెండో టీ20లో అతను అద్భుతంగా ఆడి, 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు కూడా అందుకున్నాడు. కానీ అతని రేటింగ్ పాయింట్లు మాత్రం తగ్గడం గమనార్హం. ఈ మ్యాచ్ ముందు సూర్య 910 రేటింగ్ పాయింట్లతో నెంబర్ వన్ టీ20 బ్యాటర్గా ఉన్నాడు. కానీ ఈ మ్యాచ్లో నెమ్మదిగా ఆడటంతో అతను రెండు రేటింగ్ పాయింట్లు కోల్పోవాల్సి వచ్చింది.
దీంతో ప్రస్తుతం సూర్య 908 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలోనే కొనసాగుతున్నాడు. ఇది రెండో స్థానంలో ఉన్న మహమ్మద్ రిజ్వాన్ కన్నా కూడా 70 పాయింట్లు ఎక్కువ కావడం గమనార్హం. రిజ్వాన్ వద్ద ప్రస్తుతం 838 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ప్రస్తుతం మంచి ఫామ్లో ఉన్న సూర్య.. న్యూజిల్యాండ్తో చివరి టీ20లో కనుక మంచి ఇన్నింగ్స్ ఆడితే అతని రేటింగ్ పాయింట్లు మరింత పెరిగే అవకాశం ఉంది. అదే జరిగితే క్రికెట్లో ఆల్టైం రికార్డును అతను బద్దలు చేస్తాడు.

ప్రస్తుతం టీ20 క్రికెట్లో ఆల్ టైం బెస్ట్ రేటింగ్ పాయింట్లు సాధించిన ఇంగ్లండ్ ప్లేయర్ డేవిడ్ మలన్ పేరిట ఉంది. అతను 2020లో సౌతాఫ్రికా పర్యటన సందర్భంగా సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఈ క్రమంలోనే అత్యుత్తమంగా 915 రేటింగ్ పాయింట్లు సాధించాడు. ప్రస్తుతం 908 పాయింట్లతో ఉన్న సూర్య.. ఇదే ఫామ్ కొనసాగిస్తే అతి త్వరలోనే మలన్ రికార్డును బద్దలుకొట్టి తను ఆ స్థానాన్ని ఆక్రమించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాగా, గతేడాది అద్భుతమైన ఫామ్లో ఉన్న అతనికి 'ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్' అవార్డు కూడా లభించిన సంగతి తెలిసిందే.