
కివీస్తో జరిగిన లో స్కోరింగ్ థ్రిల్లర్ మ్యాచ్లో భారత జట్టు విజయం సాధించింది. ఈ విజయంలో స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ పాత్ర చాలా కీలకం. అప్పటికే నాలుగు కీలక వికెట్లు కోల్పోయిన స్థితిలో క్రీజులోకి వచ్చిన అతను.. తన అలవాటుకు భిన్నంగా చాలా నెమ్మదైన ఇన్నింగ్స్ ఆడాడు. మ్యాచ్ చివర్లో మాత్రమే ఒక్క ఫోర్ కొట్టాడు. అతని ఇన్నింగ్స్లో అదే ఒక బౌండరీ. అసలు ఈ మ్యాచ్లో ఒక్కటంటే ఒక్క సిక్సర్ కూడా లేదంటే పిచ్ ఎంత కష్టంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఈ క్రమంలోనే మ్యాచ్లో పరిస్థితిపై సూర్యకుమార్ యాదవ్ను యుజ్వేంద్ర చాహల్ ఇంటర్వ్యూ చేశాడు. బీసీసీఐ తన సోషల్ మీడియాలో ఈ వీడియోను పంచుకుంది. రెండో టీ20లో మరో వికెట్ పడి ఉంటే టీమిండియా గెలవడం చాలా కష్టమయ్యేది. అలాంటి సమయంలో తన స్వభావానికి భిన్నంగా ఆడి జట్టును గెలిపించిన సూర్యకే 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. దీనిపై మాట్లాడిన చాహల్.. 'నా బ్యాటింగ్ చూసి ఏమైనా నేర్చుకున్నావా?' అని సూర్యను సరదాగా అడిగాడు. దీనికి సూర్య ఇచ్చిన సమాధానం ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
దీనికి చాలా సీరియస్గా బదులిచ్చిన సూర్య జోకులు పేల్చాడు. 'లాస్ట్ సిరీస్లో నువ్వు ఇచ్చిన సలహా మేరకు చాలా కష్టపడి నా ఆటతీరు మార్చుకున్నా. భవిష్యత్తులో కూడా ఇలాగే మంచి సలహాలు ఇస్తావని ఆశిస్తున్నా. వ్యూయర్స్.. దీన్ని సరదాగా తీసుకోవద్దు.. ఈయన నా బ్యాటింగ్ కోచ్' అని చెప్పాడు. ఆ తర్వాత మ్యాచ్ గురించి మాట్లాడుతూ.. క్రీజులో తను, పాండ్యా ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూనే ఉన్నామన్నాడు. 'ఏదైనా షాట్ కొట్టబోయి ఎవరు మిస్ అయినా.. విజయానికి ఒక్క బౌండరీ దూరంలోనే ఉన్నామని చెప్పుకుంటూ వచ్చాం. దాంతో అంత ఒత్తిడి లేదు' అని చెప్పాడు.